కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలను అధికార యంత్రాంగం కఠినంగా అమలు చేస్తున్నాయి. కరోనా విజృంభణ అధికం కావడంతో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టడానికి కూడా పోలీసులు, సంబంధిత అధికారులు వెనకాడటం లేదు. ఈ తరహా సంఘటనే ఒకటి ఇప్పుడు కేరళలో జరిగింది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఉల్లంఘించి వెయ్యిమంది అతిధులతో ఆర్భాటంగా తన కుమార్తె వివాహం చేసిన తండ్రిపై అల్లప్పుజా నార్త్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కేరళ రాష్ట్రంలోని అల్లప్పుజా నగరంలోని అరాట్టువాజీ ప్రాంతానికి చెందిన షమీర్ అహ్మద్ తన కుమార్తెకు టౌన్ హాలులో వెయ్యిమంది అతిధులతో ఘనంగా వివాహం చేశారు. అయితే ప్రభుత్వం ముందస్తుగా హెచ్చరించి చెప్పిన పెళ్లికి వెయ్యిమందిని పిలవడేమింటి అంటూ షమీర్ అహ్మద్పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పరిస్థితులు మీకు కనబడటం లేదా..? అంటూ మండిపడ్డారు. ఉన్నతాధికారులు కూడా సీరియస్గా తీసుకోవడంతో వెంటనే అహ్మద్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలను ఉల్లంఘించినందుకు షమీర్ అహ్మద్ పై ఐపీసీ సెక్షన్ 269, 188, 118(ఈ) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేశామని, కోర్టులో రిమాండ్ చూపుతామని సర్కిల్ ఇన్స్పెక్టరు వినోద్ కేపీ విలేఖరులకు తెలిపారు. ఈ వివాహానికి 60 మందితోనే చేయాలని స్థానిక తహసీల్దార్ సూచించినప్పటికీ ఆయన ఆదేశాలు బేఖాతర్ చేశారని తెలిపారు. పెళ్లికి హాజరైన వారు దాదాపు 1000కి పైగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వం పునరాదేశాలు జారీ చేసేంత వరకు ఇవే ఆదేశాలు కొనసాగుతాయని, ప్రజలంతా స్వచ్ఛందంగా కరోనా కట్టడికి కృషి చేయాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుతవ్ం గట్టిగా చెబుతోంది.