చికెన్ వ్యాపారులకు, పౌల్టీరంగానికి చెందిన వ్యాపారులకు కాస్త ఊరట నిచ్చే వార్త ఇది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పౌల్ట్రీ రంగంపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఒకరు రెండు కిలోల కోడిని రూ.50 అప్పజెబితే...100కు మూడంటూ మరోకడ ఆఫర్లు పెట్టి అమ్మారు వ్యాపారులు. అయితే ఆదివారం జనతా కర్ఫ్యూకు ప్రధాని మోదీ పిలుపునివ్వడంతో శనివారం సాయంత్రం హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చికెన్ కొనుగోలుకు జనాలు ఆసక్తి చూపడం గమనార్హం. దీంతో శనివారం చాలాచోట్ల రూ.100కిలో అమ్మకాలు జరిగాయి. హైదరాబాద్లో పలు చోట్ల రూ.150 కూడా అమ్మిన దాఖలాలు కూడా ఉన్నాయి.
గత కొంత కాలంగా చికిన్ తింటే కరోనా సోకుతుందన్న వదంతులు వ్యాపించడంతో ఇటీవల చికెన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా పౌల్ట్రీ రంగం తీవ్ర నష్టాలను చవిచూసింది. కొన్ని చోట్ల ఉచితంగా కోళ్లను పంపిణీ చేశారు. ”నేను రోజూ చికెన్ తింటాను.. మా ఇంట్లో కూడా అంతా చికెన్ తింటారు” అంటూ స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ సహా పలువురు నేతలు ప్రకటనలు చేసినా.. చికెన్ అమ్మకాలు పుంజుకోలేదు. పలువురు వ్యాపారులైతే ఫ్రీ పంచిపెట్టారు. మెదక్ డిస్ట్రిక్లో ఓ వ్యాపారి చెరువులో వదిలేసి వెళ్లడం విశేషం. ఈ సంఘటనలు పౌల్ట్రీ రంగంపై ఆధారపడిన వారిలో తీవ్ర భయాందోళనకు గురి చేశాయి.
రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేసినా ప్రజలెవరూ కొనుగోళ్లకు ముందుకు రాలేదు. అయితే అనుహ్యంగా శనివారం అమ్మకాలు పెరగడంతో వ్యాపారులు ధరను కూడా క్రమంగా పెంచేశారు. తాజాగా ఆదివారం జనతా కర్ఫ్యూ ఉంటుందని ప్రధాని మోదీ ప్రకటించడంతో శనివారం మాంసం షాపులు కిటకటలాడాయి. చికెన్ కొనుగోళ్లకు ప్రజలు ఎగబడ్డారు. ఇదే అదునుగా భావించిన చికెన్ విక్రయదారులు రేట్లను అమాంతం పెంచారు. దీంతో కొద్దిలో కొద్దిగా వారికి ఊరట కలిగిస్తోంది. అయితే వ్యాపారులకు లాభాలు మిగిలే అవకాశం ఉన్న కోళ్ల పెంపకందారులకు మాత్రం ఇప్పట్లో నష్టాలు పూడేలా లేవని తెలుస్తోంది.