కరోనా వైరస్ను కట్టడి చేయడంలో భాగంగా మహారాష్ట్రలో సోమవారం ఉదయం వరకూ పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జన సమూహాలు లేకుండా ఉండేందుకు వీలుగా మార్చి 31 వరకూ రాష్ట్రమంతటా 144 సెక్షన్ను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కూడా ప్రకటన చేశారు. ‘‘సోమవారం ఉదయం వరకూ జనతా కర్ఫ్యూను అనుసరించండి. మెళ్లిగా కరోనా కేసులు పెరగుతున్నాయి. విధి లేకనే రాష్ట్రంలో 144 సెక్షన్ విధిస్తున్నాం. రోడ్లపై ఐదుగురికి మించి గుమిగూడరాదు’’ అని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతుండగా మహారాష్ట్రలోనే ఇప్పటి వరకు 63 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం.
ముఖ్యంగా అక్కడి మురికివాడల్లో ఇప్పట్లో ఈ వైరస్ లక్షణాలతో వందలాది మంది పేద ప్రజలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అనుమానితులందరిని కూడా ఆస్పత్రులకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 63 సంవత్సరాల వృద్ధుడు ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ శనివారం రాత్రి తీవ్ర అనారోగ్యానికి గురై మరణించినట్లు మహారాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ వ్యక్తికి మధుమేహం, అధిక రక్తపోటు, హృదయ సంబంధ అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిసింది. ముంబైలోని కస్బూర్భా ఆసుపత్రిలో ఇప్పటికే కరోనా బారిన పడి ఒకరు మరణించిన సంగతి తెలిసిందే.
దీంతో.. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య భారత్లో ఆరుకు చేరింది. ఈ విపత్కర పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చేందుకు కఠిన చర్యలు తప్పవని, ప్రజలు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. అలాగే మార్చి 31 వరకు ఇతర దేశాల నుంచి వచ్చే విమానాలను కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది. అన్ని సర్వీసులను కూడా నిలిపేశామని, కేవలం అత్యవసర సేవలందించే వారికి మాత్రమే బస్సు సేవలను అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన ప్రకటించారు. అత్యవసర సేవలైన బ్యాంకులు, కూరగాయల ఉత్పత్తిదారులు, పాల ఉత్పత్తిదారులు ఇందుకు మినహాయింపని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు.