కట్టుదిట్టమైన చర్యలు, మెరుగైన ఆరోగ్య వైద్య విధానంతో కర్ణాటకలో కరోనా వైరస్ ప్రభావాన్ని కొంత తగ్గిస్తున్నట్లుగా పరిణామాలు తెలియజేస్తున్నాయి. తాజా అప్డేట్స్ ప్రకారం.. ఈరాష్ట్రంలో రెండు రోజుల్లో 35 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకుని ఇంటికి చేరుకున్నారు. అయితే దేశంలో ఓ వైపు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండగా ఈ వార్త శుభపరిణామమేన ని చెప్పాలి. కరోనా అంటే చావుతో సమానమే అన్న అభిప్రాయం జనాల్లో వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కరోనా బారి నుంచి బయటపడుతున్నారన్న వార్త ప్రజల్లో కాస్త ధైర్యాన్ని పెంచుతోంది. ఇదిలా ఉండగా దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ముందు రోజుతో పోల్చితే మంగళవారం కాస్త తగ్గాయనే చెప్పాలి.
కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం మంగళవారం దేశవ్యాప్తంగా 64 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం కోవిడ్ కేసుల సంఖ్య 99తో పోల్చితే చాల వరకు బెటరే అన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమైంది. కరోనా మహమ్మారిని నిర్మూలించగల మహత్తర సామర్థ్యం భారత్కు ఉందని డబ్ల్యూహెచ్వో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. గతంలో మశూచి, పోలియోల నిర్మూలనలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా కావాల్సినన్ని రక్షణ చర్యలు తీసుకుంటూనే వైరస్ నియంత్రించి..దేశం నుంచి వెళ్లగొట్టేందుకు లాక్డౌన్కు పిలుపినిచ్చారు.
ఇదిలా ఉండగా కర్ణాటకలో మంగళవారం కొత్తగా పది కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా నాలుగు మంగళూరులోనే ఉండటం గమనార్హం. వీరంతా కేరళకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీ కుమార్తె (37) కూడా కరోనా వైరస్ బారిపడటం గమనార్హం. మార్చి 22న గయానా నుంచి బెంగళూరుకు వచ్చిన ఆమె.. చిత్రదుర్గ జిల్లాలోని తన నివాసంలో క్వారంటైన్లో ఉంది. ఆమెకు వైరస్ లక్షణాలు బయటపడటంతో మంగళవారం దావణెగరె హాస్పిటల్కు తరలించి పరీక్షలు నిర్వహించారు. ఆమెకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ఇక దేశంలో ఇప్పటి వరకు 562 కేసులు నమోదు కాగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు.