వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా మామిడికాయలు, మామిడిపండ్లు దర్శనమిస్తుంటాయి. అసలు దీన్ని చూడగానే నోట్లో నీళ్లు అలా ఊరిపోతాయంతే. బంగినపల్లి, నూజివీడు రసాలు, కొత్తపల్లి కొబ్బరి.. ఇలా రకరకాల మామిడికాయలు వేసవిలో లభిస్తాయి. నోరూరిస్తూ ఉండే మామిడిపండ్లన్నా, పుల్లగా, వగరుగా, కమ్మగా ఉండే పచ్చిమామిడికాయలన్నా మన భారతీయులకు మహా ఇష్టం. అందుకే ఈ సమయంలో మిగిలిన పండ్ల కంటే మామిడి పండ్లనే కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక మామిడి పండు తినడంలోనూ ఒక్కొక్కరిదీ ఒక్కో టేస్ట్. కొందరు పచ్చి మామిడి ముక్కలపై ఉప్పూకారం జల్లుకొని తింటే.. మరికొందరు బాగా పండినవి తినడానికి ఇష్టపడుతుంటారు.
అయితే మామిడిపండ్లు మాత్రమే కాదు.. పచ్చి మామడికాయలు తినడం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునేవారు పచ్చిమామిడిని పచ్చడి గాను, కూరల్లో గాను చేర్చి తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చంటున్నారు నిపుణులు. అలాగే పచ్చి మామిడి తినడం వల్ల తక్షణ శక్తిని లభిస్తుంది. మన నోటిలోని పళ్ళు పుచ్చి పోకుండా కాపాడుతుంది. ఇంకా నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలకు ఈ పచ్చి మామిడికాయలు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
అందేకాదు పచ్చిమామిడిలోని పీచు, మెగ్నీషియం ప్రేగుల్ని శుభ్రపరుస్తుంది. మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. దీనిలో సోడి యం తక్కువ, పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల రక్తపోటు ఉన్నవారికి చాలా మంచిది. అలాగే పచ్చి మామిడి కాయ పై తొక్కను మెత్తగా నూరి మజ్జిగలో కలిపి రోజుకి రెండు, మూడు సార్లు తాగితే విరోచనాలు, పైల్స్ తగ్గిపోతాయి. మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇంకా వాంతులు, వికారం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. ఇక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బద్ధకంగా ఉండేవారు పచ్చిమామిడిని తీసుకుంటే చాలా యాక్టీవ్గా ఉంటారు.