రాత్రి పూట కర్ఫ్యూను కొనసాగించే విషయంపై రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. రాత్రి వేళల్లో గుంపులుగా, సమూహాలుగా తిరిగే వారిని ఆపడానికే ఈ నిబంధనలు విధించినట్లు ఆయన పేర్కొన్నారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ, సామాజిక దూరం పాటించడం కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. వస్తువులు చేరవేసే వాహనాలు, బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా ప్రయాణించే ప్రజలకుమినహాయింపు ఉందని అజయ్ భల్లా పేర్కొన్నారు. అనవసర కార్యకలాపాల నివారణకు కోసం ఈ కర్ఫ్యూ అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ప్రపంచంలో 20లక్షల కొవిడ్-19 పాజిటివ్ కేసుల నమోదుతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఆదేశంలో ఇప్పటివరకు 8లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా, 5లక్షల కేసులతో రష్యా మూడో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా భారత్ కరోనా కేసుల్లో ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరడం దేశ ప్రజలకు వణుకుపుట్టిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నప్పటికీ వైరస్ నుంచి కోలుకునే వారిసంఖ్య కూడా పెరగడం కాస్త ఊరటనిస్తోంది.కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలానే పెరుగుతూ పోతుంటే భారత్ అగ్రస్థానానికి చేరుకోవడానికి మరెంతో కాలం పట్టందని పలు అంతర్జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉండగా అమెరికాలో కూడా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే.
అక్కడ రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గడంతో పాటు రికవరీల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. భారత్లో రికవరీలు పెరుగుతున్నా..వ్యాప్తి విస్తృతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి సామూహిక వ్యాప్తి దశకు చేరుకోలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కోవిడ్–19 వ్యాప్తిపై దేశంలో తొలిసారిగా భారత వైద్య పరిశోధన మండలి సర్వే నిర్వహించింది. కరోనా సామాజిక వ్యాప్తి దశలోకి భారత్ ఇంకా చేరుకోలేదని పేర్కొంది. అయితే దేశంలో ఇప్పటికీ అత్యధిక జనాభాకు కరోనా ముప్పు పొంచి ఉందని మాత్రం హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వానికి గురువారం అందజేసిన సర్వే వివరాల్లో ఈ అంశాలు ఉన్నాయి. దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో, పాజిటివ్ కేసులను తగ్గించడంలో లాక్డౌన్, కంటైన్మెంట్ల ఏర్పాట్లు బాగా ఉపయోగపడ్డాయని నివేదికలో పేర్కొన్నారు.