తెలంగాణ లో కరోన టెస్టులకు ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతివ్వడంతో కరోనా టెస్ట్లు వేగం కానున్నాయి. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ను కూడా ప్రభుత్వం ధరలను నిర్ణయించి విడుదల చేసింది. హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రైవేటు ల్యాబరేటరీలు, ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ నిబంధలను అనుసరించి వ్యాధి నిర్ధారక పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలు, ధరలు నిర్ణయించాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాలను అనుసరించి రాబోయే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల
పరిధిలో దాదాపు 50 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు.
వాస్తవానికి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ముందుగా ఇక్కడ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల తర్వాత సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. మరణాల రేటు ఎక్కువగానూ నమోదవుతున్నాయి. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు జిల్లాలపై మరింత ఎక్కువ దృష్టి పెట్టాలని, ఈ ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
వచ్చే వారం, పదిరోజుల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లోని ఉప్పల్, ఎల్.బి.నగర్,మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేర్ లింగంపల్లి, చేవెళ్ల, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, పరిగి, వికారాబాద్, తాండూర్, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, నాంపల్లి, కార్వాన్, గోషా మహల్, చార్మినార్,మలక్ పేట్, అంబర్ పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, చాంద్రాయణ గుట్ట, యాకుత్ పుర, బహదూర్ పుర, పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 50 వేల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రులనే కాకుండా, ప్రైవేటు లాబరేటరీలు, ఆస్పత్రులను కూడా వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.