దేశంలో కరోనా విరుచుకుపడుతోంది. గంటగంటకు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు తర్వాత తెలంగాణ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఒక్క రోజులోనే 15,968 కేసులు, 465 మరణాలు..చోటుచేసుకున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 15,968 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 465 కరోనా మరణాలు సంభవించాయని స్పష్టం చేసింది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,561,83కి చేరుకుంది. ఇందులో 1,83,022 యాక్టివ్ కేసులు ఉండగా.. 14,476 మంది కరోనాతో మరణించారు. అటు 2,58,684 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా టెస్టులు పెంచడంతో రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో, రంగారెడ్డి జిల్లాలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. జూన్ 21న తెలంగాణలో 730 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 659 కేసులు నమోదయ్యాయి. జూన్ 22న రాష్ట్రంలో 872 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 713, రంగారెడ్డి జిల్లాలో 107 కేసులు నమోదయ్యాయి.
ఇక మంగళవారం రాష్ట్రంలో కొత్తగా 879 కోవిడ్ కేసులు నమోదు కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 652 కేసులు, మేడ్చల్లో 112 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో 1,39,010 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,531 మంది కరోనాతో చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో 66,602 కేసులు, 2,301 మరణాలు సంభవించాయి. ఇక తమిళనాడులో అయితే.. 64,603 కేసులు నమోదు కాగా, 833 మంది మృత్యువాతపడ్డారు. ఇక ఆ తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కాగా, కోవిడ్ మరణాలు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్లలో సంభవించాయి.