దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి పెరిగింది. కట్టడి చేస్తున్న..నియంత్రణ చర్యలు తీసుకుంటున్న ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 3,788 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఢిల్లీలో కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రమవుతూ వస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70వేలకు చేరుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసులు 24,988గా ఉన్నాయి... గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 16,952 శాంపిల్స్ను పరీక్షించినట్టు.. ఇప్పటివరకు 4,01,648 మందికి కరోనా టెస్ట్లు నిర్వహించినట్టు ఢిల్లీ సర్కార్ పేర్కొంది.
ఢిల్లీలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతుండగా.. కంటైన్మెంట్ జోన్ల సంఖ్య ప్రస్తుతం 261గా ఉంది.. ఢిల్లీలో కరోనా మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో ఇవాళ ఒక్కరోజే 64 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉండగా కరోనా పాజిటివ్ కేసుల్లో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది.ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. కేవలం ఆరు రోజుల కాలంలోనే రెట్టింపు కేసులు నమోదవడం గమనార్హం. ఈనెల 17న 5వేల పైచిలుకు కేసులు నమోదు కాగా సరిగ్గా ఆరు రోజుల కాల వ్యవధిలోనే 10వేలకు పైగా చేరుకోవడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.
ముఖ్యంగా హైదరాబాద్లోనే 94శాతం కేసులు నమోదై ఉండటం గమనార్హం.గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4,069 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,444కు చేరడం గమనార్హం. రాష్ట్రంలో ఈ ఒక్కరోజ కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం మరణాల సంఖ్య 225 కు చేరింది. కొత్తగా 137 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణవ్యాప్తంగా ఇప్పటివరకు 67,318 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. ఇక తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 719 కేసులు, రంగారెడ్డిలో 86, మేడ్చల్ జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి.