ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలోకి కరోనా ఆలస్యంగా ఎంటరైనా వేగంగా విస్తరిస్తోంది. కొద్దిరోజులుగా ఇక్కడ చాపకింద నీరులా కేసుల సంఖ్య పెరుగుతూ పోతుండటం గమనార్హం.ఏపీలో క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ రావడం ఆందోళనకు గురిచేస్తోంది. శ్రీకాకుళంలో పెరుగుతోన్న కరోనా వ్యాప్తి జిల్లావాసులను కలవరపెడుతోంది. వైరస్ ఆలస్యంగా జిల్లాలోకి ప్రవేశించినప్పటికీ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. చేసేదేమి లేక జిల్లాలోని కొన్ని ప్రాంతాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంగా శుక్రవారం 465 కరోనా కేసులు నమోదు కావడంతో కలవరం మొదలైంది. అయితే, కరోనా విస్తరిస్తున్నందు.. ఏపీలోని ప్రకాశం జిల్లా, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో మళ్లీ లాక్డౌన్ ప్రకటించారు అధికారులు. శ్రీకాకుళం జిల్లాలో రోజురోజుకు పెరుగుతోన్న కరోనా ఉధృతితో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పలాస, మందస, బూర్జ, ఇచ్చాపురం ప్రాంతాల్లో ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికి కూడా కరోనా సోకడంతో వాటిని కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఇదిలా ఉండగా మున్సిపాలిటీ పరిధిలోని ఉదయపురం సమీపాన శుక్రవారం ఉదయం 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో మరణించాడు.
ఈ ప్రాంతం కంటైన్మెంట్ జోన్ కావడంతో అంత్యక్రియలకు ముందు డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ లీల ఆదేశాల మేరకుమృతదేహం నుంచి శాంపిల్స్ సేకరించారు. అప్పటికప్పుడు ‘వీఎల్ఎం’ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు చేశారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలించే ప్రక్రియ కొనసాగిస్తుండగా ఫోన్ కాల్ ద్వారా ట్రూనాట్ పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. వెంటనే కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, కాలనీవాసులంతా మృతదేహాన్ని వదిలి భయంతో పరుగులు పెట్టారు. ఈ సంఘటన అటు సోషల్ మీడియాలో ఇటు ప్రధాన మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అమానవీయ ఘటనకు బాధ్యులను చేస్తూ పలాస మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్.రాజీవ్లను సస్పెండ్ చేశారు.