జలుబు లేదా పడిసం లేదా రొంప.. పేరు ఏదైనా జబ్బు ఒకటే. శ్వాసనాళం యొక్క పైభాగంలో వైరస్ దాడి చేయడం వల్ల కలిగేదే జలుబు. ఇది ఒక్కసారి వచ్చిందంటే.. అంత త్వరగా వదలదు. ఇక జలుబు వచ్చిందంటే చాలు.. దీంతో పాటే తలనొప్పి, దగ్గు, తుమ్ములు ఒకదాని తర్వాత మరొకటి ఇలా సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే వాస్తవానికి మన శరీరంలో ఏదైనా పెద్ద అనారోగ్య సమస్య వచ్చే ముందు దానికి సంకేతంగా జలుబు లేదా దగ్గు వంటివి వస్తాయి. ముఖ్యంగా జలుబు ప్రపంచంలో అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వచ్చుంటుంది.
జలుబు రావడానికి దాదాపు 200 వైరస్లు కారణం అంటారు. అయితే దీన్నుంచి ఉపశమనం పొందడానికి కూడా దాదాపు అదే సంఖ్యలో వంటింటి చిట్కాలు ఉన్నాయి. మరి వాటిలో కొన్నిటిని ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ముందుగా.. పావు టీ స్పూన్ మిరియాలు నెయ్యిలో వేంచుకున్న వెంటనే సేవించాలి. ఆ తర్వాత గోరు వెచ్చని పాలను సేవించాలి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుముఖం పడుతుంది. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల నిమ్మరసం మూడు టీస్పూన్ల తేనె మిక్స్ చేసి, రోజుకు రెండు సార్లు తీసుకుంటే జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది.
అలాగే చిన్న అల్లం ముక్కను తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించండి. ఇలా మరిగిన నీటిలో ఓ టేబుల్ స్పూన్ తేనె మరియు చిటికెడు పసుపు వేసి తాగితే త్వరగా జలుబు నుంచి ఉపశమనం పొందొచ్చు. అదేవిధంగా, మిరియాలు, బెల్లం, పెరుగు కలుపుకుని సేవించండి. దీంతో ముక్కు దిబ్బడ తగ్గిన జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక జలుబు చేసినప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిది. కానీ, అలా కాకుండా పని చేయడం, ఆఫీసులకు వెళ్లడం చేస్తే మీకు జలుబు ఎక్కువ అవుతుంది. మీ వల్ల వేరే వారికి ఆ సమస్య మొదలవుతుంది.