భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండలోని  పోలీస్ బెటాలియన్ లో 12 మందికి శ‌నివారం ఉద‌యం కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది.  హైదరాబాద్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో బందోబస్తు విధులు నిర్వహించి శుక్ర‌వారం బెటాలియ‌న్‌కు చేరుకున్న సిబ్బందికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 12మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. మ‌రి కొంత‌మందికి కూడా క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో ర‌క్త న‌మూనాల‌ను సేక‌రించి క్వారంటైన్‌కు త‌ర‌లించారు. పాజిటివ్ కేసుల సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంద‌ని వైద్య వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. బెటాలియ‌న్‌లో శానిటైజేష‌న్ ప‌నులను అధికారులు విస్తృతం చేశారు.  ప్ర‌స్తుతం బారక్ లొనే 12 మంది రోగుల‌కు చికిత్స అంద‌జేస్తున్నారు.


 ఇదిలా ఉండ‌గా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది.  గ‌డిచిన మూడు రోజుల్లోనే  కొత్త‌గా 50 కేసులు పెర‌గ‌డం గ‌మ‌నార్హం.  భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో 23 కేసులు, తొలి క‌రోనా మ‌ర‌ణం చోటు చేసుకున్నాయి. కొత్త‌గా  ఖ‌మ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని ఇద్ద‌రు వైద్యుల‌కు, ముగ్గురు హెడ్ నర్సులు,  ఒక‌ స్టాఫ్ నర్స్ ఆమె ఇద్ద‌రి పిల్ల‌ల‌కు, శ్రీనివాసనగర్ కు చెందిన మ‌రో ఇద్ద‌రు దంప‌తుల‌కు,  పెనుబల్లిలో ఒక‌రికి 1 క‌రోనా ప‌రీక్ష ఫ‌లితాల్లో పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఖ‌మ్మం జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 100కి చేరుకుంది. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో  కొత్త‌గా 23కేసులు న‌మోదు కాగా ఇందులో పాల్వంచ మండ‌ల‌కేంద్రానికి సంబంధించిన‌వే ఎక్కువ‌గా ఉన్నాయి.

 
పాల్వంచ‌లో ఆరుగురికి గ‌తంలో పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన ఒకే వ్య‌క్తి నుంచి వ్యాప్తి చెందిన‌ట్లుగా వైద్యులు గుర్తించారు. ఇంకొక‌రికి  ఎలా సంక్ర‌మించింద‌నే విష‌యాన్ని ట్రావెల్ హిస్ట‌రీ ఆధారంగా గుర్తించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ఏడు కేసుల‌తో భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో మొత్తం కేసుల సంఖ్య 49కి చేరుకుంది. ప్ర‌స్తుతం 45 కేసులు ఆక్టివ్‌గా ఉన్నాయి. మొత్తంగా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో 145 కేసులు ఆక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టికే జిల్లాకు చెందిన మరో ఏడుగురికి కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ శుక్రవారం వెలువరించిన నివేదికల్లో నిర్ధారించింది. ఖమ్మం జిల్లాలో100 మంది కరోనా బారినపడగా 25 మంది కోలుకున్న‌ట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: