కరోనా వైరస్ను ప్రపంచానికి పరిచయం చేసి మానవాళి వినాశానికి తనవంతు పాత్ర పోషించిన చైనా దేశంలోనే మరో కొత్తరకం వైరస్ జీ 4ను గుర్తించిన విషయం తెలిసిందే. ఈ వైరస్ ప్రస్తుతం పక్షువులు, పందుల్లో కనబడుతోంది. ఇవి ఏదో ఒక దశలో జంతువుల నుంచి క్షీరదాలైన మనుషులకూ సోకే అవకాశం ఉంటుందని చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని హోంగ్లీసన్ అనే శాస్త్రవేత్త ఇటీవల పందులపై జరిపిన పరిశోధనల ద్వారా జీ4 ఉనికి బహిర్గతమైంది. వీటి ద్వారా ఇప్పటికిప్పుడు మానవాళికి ముప్పులేకున్నా..భవిష్యత్లో మాత్రం ప్రమాదం ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రానున్న రోజల్లో మనుషుల పాలిట మహమ్మారిగా మారే ప్రమాదం ఉన్న మరో వైరస్ను గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు అమెరికాకు చెందిన ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్లో వారి పరిశీనలను పబ్లిష్ చేశారు. జీ4 అని పిలుస్తున్న ఈ వైరస్ ప్రస్తుతానికి మనుషులకు సోకే అవకాశం లేకున్నా.. భవిష్యత్తులో ఇది కరోనా మాదిరే మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పందుల్లో అటు పక్షి సంబంధ, ఇటు క్షీరద సంబంధ వైరస్లు రెండూ ఉంటాయి. ఇలా రెండు రకాల వైరస్లు ఒకే జంతువులో ఉన్నప్పుడు ఒకదాంట్లోని జన్యువులు ఇంకోదాంట్లోకి చేరుతుంటాయి. ఫలితంగా కొత్త రకాల వైరస్లు పుడుతుంటాయి.
పందులకు సంబంధించిన పరిశ్రమల్లో పనిచేసే ప్రతి 10 మందిలో ఒకరికి ఈ కొత్త వైరస్ ఇప్పటికే సోకిందని అధ్యయనంలో తేలింది. వారిపై యాంటీబాడీ పరీక్షలు జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని బట్టి ఇది జంతువుల నుంచి మనుషులకు సోకుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పందులను పెంచేచోట్ల ఉన్న మనుషుల్లో ఈ జీ4 వైరస్ యాంటీబాడీలు కూడా గుర్తించడం ఇంకో విశేషం. ఇలా మనుషులకు సంక్రమిస్తుండడం వల్ల మానవ శరీరంలో ఇది మరింత శక్తిమంతంగా వృద్ధి చెందేలా కాలక్రమంలో రూపాంతరం చెందే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.