వైరస్ సోకడం ద్వారా లేదా టీకా వల్ల లభించిన రోగనిరోధక శక్తి ఓ సంవత్సరంలోపే తగ్గిపోతుందనే కోణంలో పరిశోధన సాగించారు. ఇది స్థానిక వైరస్ల వల్ల కలిగే స్వల్ప అనారోగ్య సమస్యతో సమానం. వీరి అంచనా నిజమైతే ఏడాది తర్వాత కూడా వైరస్ విజృంభణ కొనసాగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో ఇతర స్థానిక కరోనా వైరస్ (ఎండెమిక్)ల సంక్రమణతో లభించే రోగనిరోధక శక్తి చాలాకాలం ఉండే అంశాన్ని కూడా విశ్లేషించారు. ఇది సాధ్యమైతే, ఇలా కొన్నేళ్లు వైరస్ వ్యాప్తి పునరావృతమైన తర్వాత పూర్తిగా నిర్మూలించే వీలుంటుందని పేర్కొన్నారు. అయితే, వీటికి వ్యాక్సిన్ లభ్యత, దాని ప్రభావంతోపాటు ఇతర కాలానుగుణ అంశాలు దోహదం చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందు కోసం ముందుగా రీ-ఇన్ఫెక్షన్లు సాధారణమనే అంశాన్ని రుజువుచేయాలి. అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్ను ప్రపంచంలోని ఎక్కువ జనాభాకు అందించడం ద్వారా వైరస్ను ఒకే ప్రాంతానికి పరిమితమయ్యే ‘ఎండెమిక్’గా స్థిరపడుతుంది. అయితే, ఈ రీ-ఇన్ఫెక్షన్లు సాధారణమైనవేనా? అవి ఎంత తరచుగా జరుగుతాయి? తిరిగి వైరస్ సోకిన వ్యక్తుల నుంచి ఎంతమందికి సోకుతుంది? వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఎంత మేరకు ప్రభావం చూపుతాయి? అనే అంశాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుందని పరిశోధకులు అభిప్రాయడ్డారు.
ఇక కరోనా వైరస్ నుంచి రోగనిరోధక శక్తి పొందిన తర్వాత ఆ వ్యక్తి మరో వైరస్ బారినపడటం కూడా ఇమ్యూనిటీపై ప్రభావం చూపుతుంది. ఒకవైరస్ సోకడానికి ముందు లేదా తర్వాత మరోవైరస్ బారినపడ్డ వారిలో ముందు ఇన్ఫెక్షన్ నుంచి లభించిన రోగనిరోధకత కేవలం స్వల్పకాలమే (వారం పాటు) రక్షణ కల్పిస్తుందనే విషయాన్ని పలు అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి. కానీ, ఏకకాలంలో సంక్రమించిన వైరస్ల ప్రభావం, వ్యాధి తీవ్రతను పెంచడంలో సంబంధం కలిగి ఉండవని పరిశోధనలు నిర్ధారించాయి. వాక్సిన్ వచ్చినా కరోనా మహమ్మారి ఎండెమిక్గా మారుతుందని అమెరికా ఫార్మా సంస్థ ఎలి లిల్లీ సీఈఓ డేవిడ్ రిక్స్ వ్యాఖ్యానించారు. ‘ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోరు.. కాబట్టి ఈ వ్యాధి స్థానికంగా మారి వ్యాప్తి చెందుతుంది. మోనోక్లోనల్ వంటి యాంటీబాడీ ఔషధాలు ఈ అనారోగ్యం ముప్పును నివారించడంలో సహాయపడతాయి’ అని అన్నారు. సమర్ధవంతమైన వ్యాక్సిన్ను తొందరగా అందుబాటులోకి తెచ్చినా అది 50-60 శాతం కంటే ఎక్కువ మందిని రక్షించలేవని అభిప్రాయపడ్డారు. ఎలి లిల్లీ సైతం యాంటీబాడీ చికిత్సా విధానంపై పనిచేస్తుంది. అయితే, క్లినికల్ ట్రయల్స్లో ఓ వాలంటీర్ అనారోగ్యానికి గురికావడంతో వాటిని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.