ఆస్ట్రాజెనికా - ఆక్స్‌ఫర్డ్ సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను సీరమ్ ఇనిస్టిట్యూట్.. భారత్‌లో ‘కొవిషీల్డ్’ పేరుతో అందుబాటులోకి తీసుకురానున్న విషయం తెలిసిందే. రానున్న డిసెంబర్ నాటికి మన దేశంలో కరోనా వ్యాక్సిన్ వస్తుందని పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది. మార్చి 2021 నాటికి మార్కెట్‌లో తగిన మోతాదులో టీకా అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో 60 నుంచి 70 మిలియన్‌ డోసుల వ్యాక్సిన్‌‌ను అందుబాటులో ఉంటుందని Serum Institute of India తెలిపింది. ఏటా 700 నుంచి 800 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయగలమని ప్రకటించింది.

ఐసీసీఐడీడీ సహకారంతో హీల్‌ ఫౌండేషన్‌ శనివారం (అక్టోబర్ 17) ‘ఇండియా వ్యాక్సిన్‌ యాక్సెసిబిలిటీ’ సమ్మిట్‌ నిర్వహించింది. ఈ సమావేశంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కరోనా వ్యాక్సిన్‌పై ప్రకటన చేసింది. బ్రిటిష్-స్వీడిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా సహకారంతో జెన్నర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (AstraZeneca-Oxford) అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా భారత్‌లో రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను నిర్వహిస్తోంది. దేశంలో మరో మూడు టీకా పరిశోధనలు కూడా కీలక దశకు చేరుకున్నాయి. వీటిలో ఒకటి ఫేజ్‌-3, మరో రెండు ఫేస్‌-2 ట్రయల్స్‌లో ఉన్నాయి. దీంతో పాటు రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీ రెండు, మూడో దశ ట్రయల్స్‌ నిర్వహించడానికి రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (RDIF)తో పాటు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) నుంచి అనుమతి లభించిందని డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ (Dr. Reddy's Laboratories) తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: