ప్రపంచ ఆరోగ్య శాస్త్రవేత్తలకే పెను సవాలు విసిరిన కరోనా వైరస్ మహమ్మారి నివారణకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విస్తృత పరిశోధనలు కొనసాగుతున్నాయి. అవి వివిధ దశల స్థాయిలో ప్రయోగాలు జరుగుతున్నాయి. అలాగే ఇక దేశీయంగా భారత్ బయోటెక్  అభివృద్ధి చేస్తున్న ‘కోవాగ్జిన్‌’టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతించింది. కరోనా టీకా మూడో దశ ట్రయల్స్‌ అనుమతి కోసం భారత్‌ బయోటెక్‌ అక్టోబర్‌ 2న డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 19 వేర్వేరు ప్రాంతాల్లో 18 ఏళ్లకు పైబడిన 28,500 మందిపై ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు నిర్వహించనున్నట్టు డీజీసీఐకి చేసిన దరఖాస్తులో వివరించింది. మరోవైపు, జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన కొవిడ్‌ టీకా సైతం రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగిస్తోంది. పుణేకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఆస్ట్రాజెనికా- ఆక్స్‌ఫర్డ్‌ టీకా భారత్‌లో రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉంది.

తాము అభివృద్ధిచేసిన కొవాగ్జిన్‌ టీకా.. జంతువులపై ప్రయోగాల్లో సత్ఫలితాలు ఇచ్చిందని గత నెలలో భారత్ బయోటెక్ వెల్లడించింది. వ్యాక్సిన్‌ డోసు ఇచ్చిన జంతువుల్లో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని తెలిపింది. అంతేకాదు, వ్యాక్సిన్‌తో ఎటువంటి దుష్ప్రభావం కలగలేదని పేర్కొంది. రెండో డోస్‌ ఇచ్చిన 14 రోజుల తర్వాత పరిశీలించామని.. ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్‌ వృద్ధిని గణనీయంగా నియంత్రించినట్లు గుర్తించామని వివరించింది. వ్యాక్సిన్‌ ఇచ్చిన జంతువుల్లో వ్యాధి నియంత్రణ అద్భుతంగా ఉందని సంస్థ పేర్కొంది. వాస్తవానికి ఆగస్టు 15 నాటికే కొవాగ్జిన్ టీకా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. దీనిపై నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెనక్కు తగ్గింది. వచ్చే ఏడాది తొలినాళ్ల వరకు వ్యాక్సిన్ సాధ్యం కాదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా వ్యాక్సిన్‌లు వివిధ దశల్లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: