షుగర్ అన్నా డయాబెటీస్ అన్నా లేదా మధుమేహం అన్నా ఒక్కటే.. ఇది ఒకరకంగా స్లో పాయిజన్ టైప్. ఇది రాకుండా ఉన్నంత వరకే ఎవరికి నచ్చినట్లు వారు ఉండడం, తినడం కూడా. ఒక వేళ వచ్చిందో.. ఇక జీవితం అంతా నరకమే. ఇష్టమైనవి తినలేక.. ఆశను చంపుకోలేక ముప్పు తిప్పలు పడాలి. ఏది తింటే ఏం ముంచుకొస్తుందో తెలియక జీవితాన్ని గడిపేయాలి. ఈ చక్కెర వ్యాధి మనకు తెలియకుండానే ఒంట్లోకి చేరుతుంది. ఒక్కసారే బయటపడి భయపెడుతుంది. ప్రస్తుతం యువత నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరినీ ఈ వ్యాధి పలకరిస్తోంది. ఆయుష్సును తగ్గిస్తోంది. మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఈ వ్యాధి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. దీన్ని పూర్తిగా నివారించే మందు లేదు. కేవలం ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారానే శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఈ కింది పేర్కొన్న ఆహారాలను దూరంగా ఉంచడం ద్వారా డయాబెటిక్ పేషంట్స్ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆ ఆహారాలేమిటో చూద్దాం...

తెల్ల అన్నం (వైట్ రైస్): సాధారణం మనం భోజనంగా తీసుకొనేది తెల్ల అన్నమే. ఇందులో ఉండే అత్యధిక కార్బోహైడ్రేట్లు చక్కెర స్థాయిలను పెంచేస్తాయి. కాబట్టి.. డయాబెటిక్స్.. వైట్ రైస్‌కు బదులు.. బ్రౌన్ రైస్ తినడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. లేదా.. వైట్ రైస్‌ను పరిమితంగా తినడం ద్వారా శరీరంలో చక్కెర స్థాయిలు పెరగకుండా జాగ్రత్తపడవచ్చట.

ఎండు ద్రాక్ష లేదా రైసిన్స్: ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, యాంటి ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. వీటి వల్ల కూడా చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

బంగాళాదుంపలు: మధుమేహ రోగులు దీన్ని అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇది శరీరంలో చక్కెర స్థాయిలను అమాంతంగా పెంచేస్తుందట. కాబట్టి.. డయాబెటీస్ రోగులు దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదట.

కొవ్వుతీయని పాలు లేదా హోల్ మిల్క్:  కొవ్వు శాతం ఈ పాలలో చాలా అధికం. ఇది శరీరంలో కొవ్వులను మరింత పెంచేస్తుంది. కాబట్టి డయాబెటీస్ రోగులు హోల్ మిల్క్‌, పాలకోవ, మైసూర్‌పాక్ వంటి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటమే మంచిది.

ఫ్రూట్ జ్యూస్‌లు: పండ్ల రసాలను అతిగా తీసుకునేవారిలో సగటున 18 శాతం మంది మధుమేహం బారిన పడుతున్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. కాబట్టి డయాబెటిక్ రోగులు పండ్ల రసాలకు దూరంగా ఉండటమే మంచిది. ఒక వేళ తాగినా.. అందులో చక్కెర లేకుండా కొద్ది మొత్తంలో తీసుకోవచ్చట.

వైట్ బ్రెడ్:  చాలామంది దీన్ని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటారు. బ్రెడ్ వల్ల ఆరోగ్యానికి ఎలాంటి సమస్య ఉండదని భావిస్తారు. అయితే.. ఇందులో కార్బోహైడ్రేట్లు, చక్కెర శాతం చాలా ఎక్కువ. ఇవి మీ శరీరంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. కాబట్టి మధుమేహం రోగులు వీటికి దూరంగా ఉండటమే ఉత్తమం.

ఎనర్జీ డ్రింక్స్: తియ్యగా ఉండే సాఫ్ట్ డ్రింక్స్‌తోపాటు శరీరానికి శక్తినిచ్చే ఎనర్జీ డ్రింక్స్‌‌ను డయాబెటీస్ రోగులు అస్సలు తీసుకోకూడదు. వీటిలో కొవ్వులను పెంచేసే రసాయనాలు ఉంటాయి. వీటిలో ఉండే చక్కెర వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా అమాంతంగా పెరిగిపోతాయి.

మటన్: మేక, గొర్రె మాంసాలకు సైతం డయాబెటీస్ రోగులు దూరంగా ఉండాలట. దానికి బదులు కాస్తంత చికెన్, చేపలు తినడం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినాలని భావిస్తే తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి.

ఫ్రెంచ్ ఫ్రైస్: ఇటీవల ఫ్రెంచ్ ఫ్రైస్ ఆహార ప్రియుకులకు ఫేవరెట్‌గా మారిపోయాయి. ఇప్పుడు ఏ మల్టీప్లెక్సులు, రెస్టారెంట్లకు వెళ్లినా ఇవే కనిపిస్తున్నాయి. బంగాళా దుంపలతో.. నూనెలో దోరగా వేయించే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వల్ల చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. కాబట్టి.. వీటికి వీలైనంత దూరంగా ఉండండి.

గమనిక:  పై వివరాలను కేవలం మీ అవగాహన కోసమే అందించామని గమనించగలరు. డయాబెటీస్‌తో బాధపడుతున్న బాధితులు తప్పకుండా వైద్యులు, ఆహార నిపుణుల సలహాలు.. సూచనలతోనే రోజువారీ డైట్‌ను తీసుకోవాలి. ఈ కథనంలోని అంశాలను ప్రామాణికంగా తీసుకోవద్దని మనవి.

మరింత సమాచారం తెలుసుకోండి: