కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత గత రెండు నెలలతో పోల్చితే ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. దేశంలో ప్రస్తుతం రోజుకు 50వేలకుపైగా కేసులు నమోదువుతున్నాయి. కేసులు తక్కువగా నమోదవుతున్నా.. మహమ్మారి తీవ్రత తగ్గలేదని, ఈ సమయంలో అలసత్వం ప్రదర్శిస్తే పరిస్థితులు చేజారే ప్రమాదం ఉందని నిపుణులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. రాబోయేది పండుగల సీజన్ సహా శీతాకాలం కావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తాజాగా, కోవిడ్-19 సన్నద్ధతపై యూపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్‌ వర్దన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

భారత్‌లో కరోనా మహమ్మారి గతిని నిర్ణయించేందుకు రాబోయే మూడు నెలలే అత్యంత కీలకమని హర్షవర్ధన్‌ వెల్లడించారు. రానున్న పండుగ సీజన్‌తో పాటు శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని, అప్పుడే కరోనాపై యుద్ధంలో పైచేయి సాధిస్తామని సూచించారు. గత మూడు నెలలుగా దేశంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు రోజుకు 95వేల కేసులు నమోదయ్యేవని.. ఇప్పుడు వాటి సంఖ్య 55వేలకే పరిమితమైందని తెలిపారు. రికవరీ రేటు దాదాపు 90 శాతం ఉండగా.. మరణాలు రేటు 1.51శాతంగా ఉందని వివరించారు.
మరణాల రేటును ఒక్క శాతం లోపునకు తీసుకురావడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. కాంటాక్ట్ ట్రేసింగ్, పర్యవేక్షణ, టెస్టింగ్ సామర్ధ్యం, తొలి దశలోనే వైరస్ బాధితులను గుర్తించడంతో మరణాల రేటు తగ్గించవచ్చని అన్నారు. బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం వల ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి పెద్ద రాష్ట్రాల్లో వైరస్‌ను కట్టడి చేయగలిగినట్లు హర్ష్‌వర్ధన్‌ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా రోగనిరోధక శక్తి కోల్పోయిన చిన్నారులకు టీకా వేయడానికి ఉత్తరప్రదేశ్ అధికారులు చేసిన కృషిని మంత్రి అభినందించారు. కరోనా మరణాల రేటు జాతీయ సగటు కంటే యూపీలో తక్కువగా ఉందని, రికవరీ రేటు ఎక్కువగా ఉందని అన్నారు. దేశంలో యాక్టివ్ కేసులు ఏడు లక్షల కంటే తక్కువ ఉందని, డబులింగ్ రేటు 97.2 రోజులుగా ఉందన్నారు. కోవిడ్ మొదలయ్యే సమయానికి దేశంలో ఒకే ఒక ల్యాబొరేటరీ ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 2,000 దాటిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: