కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మరోసారి ప్రపంచానికి హెచ్చరికలు చేసింది. మహమ్మారి విషయంలో ప్రపంచం ప్రస్తుతం ఓ కీలక మలుపులో ఉందని పేర్కొంది. ఈ సమయంలో కొన్ని దేశాలు ప్రమాదకర మార్గంలో ప్రయాణిస్తున్నాయని డబ్ల్యూహెచఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధ్నోమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా దేశాల్లో ఆరోగ్య సేవల వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉందని ఆయన హెచ్చరించారు. ప్రత్యేకించి ఉత్తరార్థ గోళంలోని దేశాలు ప్రమాదం ముంగిట ఉన్నాయని అధ్నోమ్ పేర్కొన్నారు.

మనం ఇంకా అక్టోబర్‌లోనే ఉన్నామని.. రాబోయే కొద్ది నెలలు మరింత కఠినంగా ఉండనున్నాయని ఆయన వివరించారు. అనేక దేశాల్లో కేసుల సంఖ్య పెరగడంతో ఆస్పత్రులు, అత్యవసర వైద్య సేవలు ఇప్పటికే కిక్కిరిసిపోయాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత ప్రాణ నష్టం జరగకుండా, ఆరోగ్య, విద్యా వ్యవస్థలు కుప్పకూలకుండా తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా దేశాధినేతలను అధ్నోమ్ కోరారు. కరోనా కట్టడి కోసం ఆయా దేశాలు విచక్షణాయుతంగా చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌ జనరల్‌ కోరారు. ఇదే విషయాన్ని తాను ఫిబ్రవరిలో చెప్పానని.. ఇప్పుడు మళ్లీ గుర్తుచేస్తున్నానని ఆయన అన్నారు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల పెంపు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ఐసోలేషన్‌ నిబంధనలను పాటించడం వల్ల మహమ్మారి ముప్పు నుంచి తప్పించుకోవచ్చని, లాక్‌డౌన్ విధించే పరిస్థితి రాకుండా నిరోధించవచ్చని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సూచించారు.

ఇటీవల డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ.. అత్యంత సమర్థవంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్ 2021 నాటికి కనీసం ఒక్కటైనా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, కరోనా వ్యాక్సిన్ డోసులు పరిమిత సంఖ్యలోనే లభ్యం కావొచ్చని పేర్కొన్నారు. మహమ్మారిపై ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, అత్యధిక ముప్పు ఉన్నవారికి, వయసు మళ్లిన వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఆరోగ్యవంతులైన యువతకు ఇప్పట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: