భయంకరమైన కరోనా వైరస్‌ మహమ్మారిని నియంత్రించే వ్యాక్సిన్ గురించి ప్రపంచ దేశాలు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఒక్కసారి వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ఎవరికివారు తమ దేశ ప్రజలందరికీ అందించాలని ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ అద్నోమ్ గ్యాబ్రియేసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జర్మనీ రాజధాని బెర్లిన్ వేదికగా సాగే మూడు రోజుల ప్రపంచ ఆరోగ్య సమ్మిట్‌‌ ప్రారంభోత్సవంలో వీడియో ద్వారా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ప్రపంచ దేశాలన్నీ ఎవరికివారు కేవలం తమ దేశంలోనే టీకా వినియోగించాలన్న తీరు సరికాదని అన్నారు. తమ ప్రజలను కరోనా వైరస్ బారి నుంచి కాపాడుకునే ఉద్దేశంతో వ్యాక్సిన్‌ను దక్కించుకునేందుకు దేశాలు పోటీపడటం సహజమేనని, అయితే దీనిని ఎంత సమర్థంగా వినియోగించగలమన్న అంశం మీదే కోవిడ్-19 వ్యాప్తి ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు.


వ్యాక్సిన్‌ నేషనలిజం వల్ల కరోనా మహమ్మారి మరింత విజృంభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాదు, దాన్ని నియంత్రించే అవకాశం ఉండదని హెచ్చరించారు. ఐరోపా దేశాల్లో రోజురోజుకీ కొత్త కేసులు భారీగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా విజృంభణ చాలా ప్రమాదకరంగా ఉందని, దీని వల్ల మళ్లీ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని చెప్పారు. అందుకే వ్యాక్సిన్‌ను కొన్ని దేశాలకే పరిమితం చేయాలనుకోవడం సరైంది కాదని అధ్నోమ్ పేర్కొన్నారు. టీకా అందుబాటులోకి వచ్చి దాన్ని అన్ని దేశాల్లోనూ వినియోగంలోకి తెచ్చినపుడే ఆశించిన ఫలితాలు దక్కుతాయని తెలిపారు. వాక్సిన్‌ను ఇలా సమర్థంగా వాడితేనే కరోనా వ్యాప్తిని కట్టడి చేయవచ్చని సూచించారు. ‘ఒక టీకా ప్రపంచ ప్రజానీకానికి మేలు చేసేదిగా ఉండాలి.. ప్రాణాలు కాపాడటంలో పరీక్షలు, చికిత్సలు, టీకాల పాత్ర కీలకం.. ఆర్దిక, సామాజిక భద్రతకు ముఖ్యం’ అన్నారు. కాగా, వ్యాక్సిన్ విషయంలో అమెరికా వంటి దేశాలు భారీ స్థాయిలో ముందస్తుగా వ్యాక్సిన్‌ డోసులు కొనుగోలు చేస్తోన్న విషయం తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.16 మిలియన్ల మంది కరోనాకు బలయ్యారు. ఇదిలా ఉండగా వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదుకావడంతో మహమ్మారి కట్టడికి సరైన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. శనివారం ప్రపంచవ్యాప్తంగా 465,319 కేసులు నమోదుకాగా.. ఇందులో సగం ఐరోపా దేశాల్లోనే బయటపడ్డాయని తెలిపింది. ఉత్తరార్దగోళంలో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని, వైద్య ఆరోగ్య, విద్యా వ్యవస్థలు కుప్పకూలిపోయే ముప్పు పొంచి ఉందని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: