కరోనా వైరస్ మహమ్మారి కారణంగా  గత కొన్ని నెలలుగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యాలతో పాటు ఆర్ధిక వ్యవస్థలు కూడా ప్రమాదంలోకి జారుకున్నాయి. కోవిడ్-19ను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ఏకైక మార్గమని భావించి వీలైనంత త్వరగా నిరోధక టీకా రావాలని కోరుకుంటున్నారు ప్రజలు.అయితే ప్రపంచవ్యాప్తంగా వివిధ దశలలో వ్యాక్సిన్లు సిద్ధమవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ చేసిన పలు వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ప్రస్తుతం కరోనా వైరస్‌ కట్టడికి అభివృద్ధి చేస్తున్న తొలితరం టీకాలు అన్నీ అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉందని టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ కేట్‌ బింగమ్‌ వ్యాఖ్యానించారు. అసలు కోవిడ్-19కు పూర్తిస్థాయి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందో.. లేదో.. కూడా చెప్పలేమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌లు పూర్తిగా కరోనాను నిరోధించకపోయినా దాని లక్షణాలు, వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయని తెలిపారు. అలాగే అందరికీ వ్యాక్సిన్‌ సమర్ధవంతంగా పనిచేస్తుందని కూడా చెప్పలేమని పేర్కొన్నారు. ఈ పరిస్థితులకు ప్రతిఒక్కరూ సంసిద్ధంగా ఉండాల్సిందేనని ఉద్ఘాటించారు. ఈ మేరకు ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌లో టీకా కోసం తాము చేస్తున్న కృషిని వివరిస్తూ ఓ కథనం ప్రచురించారు. ప్రస్తుతం వివిధ ప్రయోగ దశల్లో ఉన్న దాదాపు అన్ని వ్యాక్సిన్లు విఫలమయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించామని బింగమ్‌ పేర్కొనడం ఆందోళన కలిగించే అంశం. ఈ నేపథ్యంలో సమర్థమైన, సురక్షితమైన టీకాను అందించడమే లక్ష్యంగా తమ బృందం పనిచేస్తోందని వివరించారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కరోనా మరణాల్లో ఎక్కువగా 65 ఏళ్ల పైబడిన వారిలోనే ఉంటున్నాయని గుర్తుచేశారు.

దీంతో 65 ఏళ్ల పైబడిన వారిలో రోగనిరోధకశక్తిని పెంచే వ్యాక్సిన్‌ పైనే దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌‌ తయారీ సామర్థ్యం ఏమాత్రం సరిపోదని బింగమ్‌ తెలిపారు. ఇదిలా ఉండగా వేసవికాలంలో బ్రిటన్ ప్రజల్లో యాంటీబాడీలు అత్యంత వేగంగా క్షీణిస్తున్నట్లు గుర్తించామని ‘ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్ లండన్‌’ అధ్యయనం తెలిపింది. దీంతో కరోనా బాధితుల్లో యాంటీబాడీలు ఎక్కువ కాలం ఉంటాయని ఆశించలేమని వెల్లడించింది. మరోవైపు, రెండో దశ కరోనా వైరస్‌ మరింత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉందన్న అంచనాలతో యూకే ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు టెలిగ్రాఫ్‌ పత్రిక వెల్లడించింది. అయితే ఇప్పుడు మరలా ఐరోపా దేశాల్లో మరోసారి కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తుండటం బాధాకరమైన విషయం

మరింత సమాచారం తెలుసుకోండి: