సుమారుగా గత 10 నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలనకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విస్తృత స్థాయిలో వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్న సంగతి తెలిసిందే... ఇప్పటికే కొన్ని ప్రయోగాల చివరి దశలలో ఉండగా మరికొన్ని వాటిని అనుసరిస్తున్నాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి గురించి ప్రపంచానికి తెలియనీయకుండా చైనా ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తాజాగా, దీనికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. కోవిడ్-19 పరిధిని అధికారిక గణాంకాలను తగ్గించడం ద్వారా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందని వుహాన్‌లో బయటపడిన పత్రాలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ ఓ కథనం ప్రచురించింది. సీఎన్ఎన్‌కు లభించిన వైరస్‌కు మూలకేంద్రమైన హుబే ప్రావిన్సుల ఆరోగ్య విభాగం అధికారిక సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 10 న 5,918 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అయితే, అధికారికంగా మాత్రం ఇందులో సగం కేసులనే ప్రకటించింది. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు విషయం గురించి ప్రపంచానికి తెలియజేయలేదని నివేదిక పేర్కొంది.



హుబే ప్రావిన్సియల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుంచి లీక్ అయిన 117 పేజీల పత్రాలలో గతంలో బహిర్గతం చేయని అంశాలు ఉన్నట్లు నివేదిక తెలిపింది. చైనాలో మహమ్మారి ప్రారంభం నుంచి ఈ పత్రాలు చాలా ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేస్తున్నాయని, అంతర్గతంగా స్థానిక అధికారులకు మొత్తం తెలుసు అనేదానికి స్పష్టమైన ఆధారాలని వ్యాఖ్యానించింది. కరోనా వైరస్ ప్రారంభ రోజుల్లో మహమ్మారి వ్యాప్తిని చైనా సక్రమంగా అరికట్టలేదనడానికి వుహాన్ పత్రాలనే ఇందుకు ఆధారాలు. కోవిడ్ -19లో జంతువు మూలాలను కనుగొనడానికి సాధ్యమయ్యే ప్రతిదాన్ని పరిశీలిస్తామని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘ్యాబ్రియేసిస్ ప్రకటించిన తర్వాత కూడా చైనా వివరాలను దాచిపెట్టింది. ‘వైరస్ మూలాలను తెలుసుకోవాలనుకుంటున్నాం.. దానిని తెలుసుకోవడానికి ప్రతిదీ చేస్తాం.. ఈ విషయంలో డబ్ల్యూహెచ్ఓ వైఖరి చాలా స్పష్టంగా ఉంది.. ఈ వైరస్ మూలాన్ని మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సహాయపడుతుంది’ టెడ్రోస్ అన్నారు.



కొత్తరకం కరోనా వైరస్‌లో జంతు మూలాలు, వైరస్ తొలుత మానవులకు ఎలా సంక్రమించిందనే విషయాన్ని గుర్తించడానికి అంటువ్యాధి, జంతు ఆరోగ్య నిపుణులతో సహా అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని చైనాకు పంపేందుకు డబ్ల్యూహెచ్ఓ నెలల తరబడి కృషి చేస్తోంది. దర్యాప్తునకు పునాది వేయడానికి జులైలో ముందస్తు బృందాన్ని పంపింది.. అయితే చైనాకు వెళ్లి అధ్యయనాన్ని ప్రారంభించడానికి పెద్ద సంఖ్యలో శాస్త్రవేత్తల బృందానికి చైనా ఇంత వరకు అనుమతి ఇవ్వలేదు. దీన్ని బట్టి చైనా పారదర్శకతపై సందేహాలు వ్యక్తం చేసిన పలు దేశాలు.. డబ్ల్యూహెచ్ఓ తీరుపై విమర్శలు గుప్పించాయి. చైనా ప్రభుత్వం నుంచి నేరుగా కాకుండా మీడియా నివేదికల ద్వారా వ్యాప్తి గురించి తెలుసుకున్నట్టు ప్రకటించడంతో ఈ సంస్థపై కలిగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: