వ్యాక్సినేషన్ వల్ల ప్రజల్లో ఎటువంటి భయాలు, అపోహలు లేకుండా ఉండేందుకు ప్రధాని మోదీ నుంచి ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ వరకు అందరూ ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు వ్యాక్సిన్ కేంద్రాల్లో దగ్గరుండి మరీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ను ప్రారంభించడం విశేషం. ముందుగా పారిశుధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తూ కేంద్రం ఆదేశాలను ఇరు ప్రభుత్వాలు పాటించాయి. హైదరాబాద్ వరకు 1,330 మందికి వ్యాక్సిన్ వేయగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3530 మందికి టీకా వేసినట్లు తెలంగాణ రాష్ర్ట హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. రాష్ర్టంలో ఏర్పాటుచేసిన 140 సెంటర్లలో 30 చొప్పున వ్యాక్సిన్ లు వేసినట్లు వివరించారు. వ్యాక్సినేషన్ లో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ ప్రక్రియ కోసం తమ సిబ్బంది రెండు నెలలు కష్టపడ్డారని చెప్పారు. వ్యాక్సిన్ ప్రక్రియ సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ మొదటి వారం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన వారికి, రెండో వారం నుంచి ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందికి కూడా అందిస్తామని ఇరు రాష్ర్టాల వైద్యాధికారులు చెబుతున్నారు.
ఏపీలోనూ విజయవంతంగా వ్యాక్సిన్ ప్రక్రియ ముగిసింది. మొత్తంగా 332 కేంద్రాలలో వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఒకరిద్దరికి లైట్ గా జ్వరం, దురదలు వచ్చాయి. మిగిలిన వారికి ఏ విధమైన ఇబ్బందులు తలెత్తలేదని వైద్యులు తెలిపారు. మొత్తానికి మొదటి రోజు వ్యాక్సిన్ ప్రక్రియ ప్రశాంతంగా జరగడంతో ఇరు రాష్ర్టాల ప్రజాప్రతినిధులు, వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు.