దాదాపు గత 13 నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలనకు వ్యాక్సిన్ సిద్ధం అయింది. అంతేకాకుండా ఇప్పటికే కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ కూడా జరుగుతుంది. అయితే ఈ వ్యాక్సినేషన్ లో భాగంగా వృద్ధులు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి కొవిడ్ వ్యాక్సిన్తో ప్రమాదం ఉందని నార్వే హెచ్చరిస్తోంది. ఆ దేశంలో తొలి విడతగా డోసు తీసుకున్న వృద్ధుల్లో 23 మంది మరణించారు. ఈ విషయాన్ని నార్వే ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే వీరందరూ వయసు పైబడిన వారే కావడం గమనార్హం. బలహీనంగా ఉన్న వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ఇతర రోగులు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటారని వైద్యులు చెబుతున్నారు. ఈ మరణించిన 23 మందిలో 13 మందికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టుల్లో వ్యాక్సిన్ అనంతరం దుష్పరిణామాల వల్ల మరణించినట్లు నివేదిక వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్న వేళ ఇది ప్రకంపనలు రేపుతోంది. నార్వేలో డిసెంబర్ చివరి వారం నుంచి మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఆ దేశంలో ఇప్పటివరకు 33 వేల మందికి పైగా కొవిడ్ టీకా తీసుకున్నారు.
ఏమాత్రం ఆరోగ్యంగా లేని వృద్ధులకు వ్యాక్సిన్ ఇస్తే వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు వైద్యులు గుర్తించారు. జీవిత చరమాంకంలో ఉన్నవారికి టీకా వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంది. వారికి వ్యాక్సిన్ అనవసరం అనిపిస్తోంది’ అని నార్వే ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. వ్యాక్సిన్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య తక్కువగానే ఉందని ఫైజర్, బయోఎన్టెక్ సంస్థలు చెబుతున్నాయి. వృద్ధుల మృతి అంశంపై ఆ సంస్థలు విచారణ చేపట్టాయి. కరోనా వైరస్ వల్ల రిస్క్ ఉన్న 33 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వగా.. 29 కేసుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం ఉందని నార్వే ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో మూడో వంతు 80 ఏళ్లు దాటినవారే కావడం గమనార్హం. అయితే.. ఆరోగ్యవంతులు, యువకులు నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చునని నార్వే ప్రభుత్వం చెబుతోంది. కావున వ్యాక్సిన్ తీసుకునేవారు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం, ఆలోచనలు చేయటం అవసరం.