గడిచిన గత ఏడాది కాలంగా ప్రపంచ దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌ నిర్మూలనకు ప్రపంపవ్యాప్తంగా పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఓ వైపు ఈ వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతుండగా.. మరోవైపు ఈ వైరస్ కొత్త ఉత్పరివర్తనాలతో, రూపులతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే యూకేను అతలాకుతలం చేస్తోంది. అలాగే అమెరికాలోనూ వైరస్ విజృంభిస్తోంది. ఇంకా పలు దేశాల్లో వివిధ రకాల కొత్త లక్షణాలతో వైరస్ వ్యాప్తి చెందుతోంది. కొవిడ్ మహమ్మారి సోకినవారిలో మొదట్లో జ్వరం, జలుబు, శ్వాసకోశ సమస్య, తలనొప్పి, అలసట లాంటి లక్షణాలు మాత్రమే కనిపించాయి. అనంతర కాలంలో రుచి తెలియకపోవడం కూడా ఒక లక్షణంగా తేలింది. తాజాగా మరో కొత్త లక్షణం బయటకొచ్చింది.







కరోనా సోకిన వ్యక్తి నోటి లోపల ఇన్ఫెక్షన్ ఏర్పడుతున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. కరోనా సోకిన కొంత మంది వ్యక్తుల్లో నాలుకపై ఎర్రని బొడిపెలు వస్తున్నాయి. నోట్లో బొబ్బలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే నాలుకపై తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి. ఇది అంతా కూడా కరోనా లక్షణమేనని నిపుణులు గుర్తించారు. ఈ కొత్త లక్షణానికి ‘కొవిడ్ టంగ్’ (Covid Tongue) అని పేరు కూడా పెట్టారు. ప్రతి ఐదుగురు రోగుల్లో ఒకరికి ఇలాంటి లక్షణాలు ఉంటున్నట్లు గుర్తించారు. అయితే.. ఇది అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. నాలుకపై బొబ్బలు ఏర్పడుతుండటంతో రోగులు నోటి అసౌకర్యంతో బాధపడుతున్నారు. తలనొప్పి, అలసటతో పాటు ఈ అసాధారణ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌ ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ ఈ కొత్త లక్షణం గురించి వివరించారు. ఇలాంటి లక్షణాలున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆయన తెలిపారు. నాలుక ఎర్రబారడం, బొబ్బలు ఎక్కడం లాంటి లక్షణాలు కనిపిస్తే ఆందోళనకు గురవ్వాల్సిన పనిలేదని.. నాలుగైదు రోజుల్లోనే సాధారణ స్థితికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉండి తగిన జాగ్రత్తలు పాటించినా కూడా ఈ ఇబ్బంది నుంచి బయటపడొచ్చునని తెలిపారు. కాకపోతే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: