మన చుట్టూ దొరికేటటువంటి ఉసిరికాయ,తానికాయ, కరక్కాయ... ఈ మూడు కాయలను కలిపి త్రిఫలాలు అంటారు. వీటితో తయారు చేసిందే త్రిఫల చూర్ణం. ఇందులో విటమిన్ సి, ఫైటో న్యూట్రియన్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. పోషకాల కంటే వీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ చూర్ణాన్ని సమాన పరిమాణంలో తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సాధారణంగా దీనిని మలబద్దక సమస్యల నివారణకు ఉపయోగిస్తారు.
త్రిఫల చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకుంటారు. అయితే ఈ మూడు కాయల చూర్ణాన్ని వేటితో ఉపయోగించుకోవచ్చు అంటే గోరు వెచ్చని లేదా చల్లని నీళ్లు, పాలు, తేనె.. ఇలా వివిధ రకాల ద్రవాలతో కలిపి తీసుకున్నప్పుడు ఫలితాలు మారుతూ ఉంటాయి. దీనిని ఏ వయస్సు వారైనా తీసుకోవచ్చు. చిన్నపిల్లలు తక్కువ మోతాదులో తీసుకోవాలి.
1). కళ్ళ సమస్యలు ఉన్నవారు పాలతో తీసుకోవాలి. పాలలో,తేనె,నెయ్యి తో ఈ చూర్ణాన్ని కలిపి తింటే కళ్ళకి మేలని చెప్పవచ్చు.
2). పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్ళలో కలిపి తీసుకుంటే మలబద్దకం ఉండదు.
3). అధిక బరువు ఉన్నవారు చల్లని నీటితో ఈ చూర్ణాన్ని తీసుకుంటే బరువు తగ్గుతారు.
4). నరాల సమస్య,మధుమేహం ఉన్నవారు ఈ సమస్యలను తగ్గించేందుకు ఈ చూర్ణం ఎంతగానో ఉపయోగపడుతుంది.
5). నోటిపూత,చిగుళ్ల వాపు వచ్చినవారు గోరువెచ్చని నీటిలో చూర్ణాన్ని వేసుకుని పుక్కిలించండం మంచిది.
6). జుట్టు రాలే సమస్య ఉన్నవారు త్రిఫల చూర్ణాన్ని కలిపి తలకు రాసుకుంటే, జుట్టు రాలే సమస్యను తగ్గించవచ్చు.
7). కడుపులో నులిపురుగులు ఉన్నవారు త్రిఫల చూర్ణాన్ని వాము తో కలిపి తీసుకోవాలి.
8). జలుబు,దగ్గు, అజీర్తి సమస్యలు ఉన్నవారు ఈ చూర్ణాన్ని సొంటి, మిరియాల తో కలిపి తీసుకోవాలి.
9). సోరియాసిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, గోరువెచ్చని నీటిలో లేదా తేనెతో త్రిఫల చూర్ణాన్ని కలిపి తీసుకోవాలి.
ముఖ్య గమనిక : ఈ చూర్ణాన్ని మోతాదుకు మించి తీసుకుంటే విరేచనాలు అవుతాయి. దీనికి విరుగుడుగా పెరుగు లేదా మజ్జిగ తీసుకోవచ్చు.