వెస్ట్ మారేడు పల్లి - సికింద్రాబాద్ -
నిన్నటి వేళ బారులు తీరిన జనం
టీకాలు ఉన్నాయో లేవో చెబితే
ముందస్తు సమాచారం ప్రకటిస్తే
ఈ తలనొప్పి ఉంటుందా?
ప్రజలకు అవగాహన లేదంటే తిడతారు. అవగాహన వస్తే మీరు పట్టించుకోరు. డబ్బై ఎనిమిది వేల మంది టీకాల కోసం బారులు తీరితే మీరు ఇచ్చింది కేవలం ఇరవై ఎనిమిది వేలే అంటూ.. భాగ్య నగరికి చెందిన ప్రజా సంఘాలు మండి పడుతున్నాయి.
టీకా పై ప్రచారం వరకే తమ పని అని అనుకుని ప్రభుత్వం ఉన్నంత వరకూ ఇలాంటి తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. కేవలం భాగ్య నగరిలోనే కాదు చుట్టు పక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ టీకా కేంద్రాలలోనూ ఇదే సమస్య నెలకొని ఉంది. మాట్లాడాల్సిన వారు మాట్లాడకుండా, తగు ఏర్పాటు చేయకుండా కేవలం ఊక దంపుడు ప్రసంగాలే చేస్తే ఫలితం ఇలానే ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
...........బాధ్యత ప్రభుత్వానిదే!
కరోనా మహమ్మారి కట్టడికి వచ్చిన టీకాలు అందరికీ అందుబాటులోకి రాకపోవడం ఇప్పటికీ ఓ విచిత్రం. భాగ్యనగరిలో టీకాలు అందించే కేంద్రాలు వద్ద తొక్కిసలాటలు జరుగుతున్నాయంటే ఈ పరిస్థితి ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదట్లో టీకాలపై ప్రజలకు నమ్మకం లేకపోయినా, క్రమంగా పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం కారణంగా ఎక్కువ మందికి వీటిపై అవగాహన కలిగింది. సెలబ్రిటీలు చేసిన ప్రచారం కూడా ఇందుకు కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. టీకా కేంద్రాల వద్ద బారులు తీరిన జనం కారణంగా మళ్లీ కరోనా విజృంభిస్తుందా అన్న భయాలు నెలకొని ఉన్నాయి. వీటిని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే!
టీకాకు అని వస్తే........
........కరోనా అంటిస్తరా!
నగరం వ్యాప్తంగా నిన్న ఒక్క రోజున 157 టీకా కేంద్రాల ద్వారా 28 వేల మందికి మాత్రమే టీకాలు వేశారని గణాంకాలు చెబు తున్నాయి. కొందరికి మొదటి డోస్ కూడా వేయలేదు. కొందరు రెండో డోస్ వేయించుకోవాలంటే టీకా దొరక్క క్యూ లైన్లకు భయ పడి వెనుదిరిగారు. టీకాలపై సమగ్ర సమాచారం సోషల్ మీడియా ద్వారా అందించకుండా అధికారుల అలసత్వం వహిస్తున్నా రన్న ఆరోపణలూ ఉన్నాయి.