కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కట్టడి కి చర్యలు తీసుకునేందుకు రాష్ట్రాలు పనిచేయాలని కేంద్రం ఆదేశిస్తుంది. ముఖ్యంగా ఏడాది చివరలో ఉన్న ఈ రెండు రోజులలో ప్రధాన నగరాలు కానీ ప్రధాన పర్యాటక ప్రాంతాలు కానీ రద్దీగా ఉంటాయని కనుక వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని అంటోంది. ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని స్పష్టమయిన సమాచారం ఒకటి అక్కడి అధికార యంత్రాంగం ఇస్తోంది. అయితే రెండు డోసులు తీసుకున్న వారికి కూడా ఇమ్యూనిటీ చాలక చాలామంది కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడి అస్వస్థతకు లోనవుతున్నారని అంటున్నారు వైద్యాధికారులు. ఆస్పత్రికి చేరి సకాలంలో పరీక్షలు, వ్యాధి పీడితుల గుర్తింపు, సమీపంగా మెలిగిన వారిలో వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేవా అన్న నిర్థారణ (ట్రేసింగ్) వీటితో పాటు టీకాలు వేయించడంలో కూడా మరింత వేగంగా పనిచేయాలని కేంద్రం అంటోంది.
ఇప్పటికే ఏపీ సర్కారు ఫీవర్ సర్వే పై దృష్టి సారించింది. గత అనుభవాల నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలు వద్దనే అంటోంది. రాత్రి పూట కర్ఫ్యూ విధించేందుకు దానిని పాటించేందుకు కూడా ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే కన్నడ నాట రాత్రి పూట కర్ఫ్యూ నిర్వహిస్తున్న విషయం విధితమే!అయితే తాజా కేంద్రం మార్గదర్శకాలతో సర్కారు అప్రమత్తమై బూస్టర్ డోసు ముందుగా వృద్ధులకు, తరువాత ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందించాలని భావిస్తోంది. రాష్ట్రంలో 29 లక్షల మంది వృద్ధులకు బూస్టర్ డోస్ అందించడంతో పాటు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న 4.89 లక్షల మంది వచ్చే నెల పదిన బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
రెండు డోసులు తీసుకున్నాక తొమ్మిది నెలలు పూర్తి చేసుకున్నవారికే మూడో డోస్ అందించేందుకు వైద్యాధికారాలు సన్నాహాలు చేస్తున్నారు. 38.810 లక్షల కొవిషీల్డ్ టీకాలు, 7.63లక్షల కొవ్యాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉన్నాయి అని అధికారులు చెబుతున్న మాట. ఏదేమైనప్పటికీ ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు, వృద్ధులకు బూస్టర్ డోస్ అందించడమే ధ్యేయంగా కొత్త ఏడాదిలో కార్యాచరణ ఉండనుందని నిర్థారిస్తున్నారు ఏపీ సర్కారు వర్గాలు.