బయటకు వెళ్లేందుకు వీల్లేదు
ఇంట్లో ఆటలా కుదరదు
ఇంకేం చేస్తారు టైం పాస్ కావాలి
అవును పుస్తకాలు చదవడం బోర్ కూడా!
క్లాసు పుస్తకాలు వద్దులే కానీ కనీసం స్టోరీ బుక్స్ అయినా
చదవచ్చు కదా అంటే అయ్యో!అందుకు కూడా ఒప్పుకోరు
ఇదీ ఇవాళ్టి కొవిడ్ టైం. చదువులు కాదు మతులు పోతున్నాయి మహమ్మారుల వేళ అని తల్లులు కొప్పు ముడేసి మరీ! చింతిస్తున్నారు.బాధపడుతున్నారు.ఇదే సమయంలో వారి దృష్టిని మరల్చేందుకు ఏం చేయాలో అని నిపుణులను సంప్రదిస్తున్నారు.ఆట పాటలు లేకున్నా ఆన్లైన్ లో కొన్ని సంగీతం పాఠాలు చెబుతున్న వారు ఉన్నారు..వారి దగ్గర చేర్పించండి చాలు వాళ్లే దార్లో పడతారు అని చెబుతున్నారు బెంగళూరు కు చెందిన నిపుణులు.అదేవిధంగా ఆన్లైన్ గేమ్ కల్చర్ ను మాన్పించి,వీలున్నంత వరకూ తోటి పిల్లలతో ఆడుకునే వెసులుబాటే ఇవ్వాలని కూడా సూచిస్తున్నారు.ఇవే కాకుండా ఆన్లైన్ క్లాసు ఉన్నా ఇంటి వాతావరణంను అందుకు తగ్గ విధంగా కాస్తో కూస్తో మార్పులు చేస్తే వారికీ శ్రద్ధ పెరుగుతుంది అని కూడా చెబుతున్నారు.ఈ పాటి మార్పులు పాటిస్తే చాలు మంచి ఫలితాలు రావడం తో పాటు ఉద్వేగాల నియంత్రణ కూడా సాధ్యమే!
పిల్లలు మానసికంగా ఎదిగేందుకు అవకాశం ఉన్న చోటు పాఠశాలలు,కళాశాలలు.కరోనా కారణంగా ఎప్పటికప్పుడు సెలవులు వస్తూ ఉన్నాయి.ఇంకేం ఇంట్లో ఉంటూ సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్న నేటి తరం నేర్చుకోవాల్సింది ఎంతో! కేవలం తమ కళ్లను డిజిటల్ స్క్రీన్ల కు అప్పగించడం కారణంగానే అనేక సమస్యలు వస్తున్నాయన్న కనీస స్పృహ వాళ్లలో లేకపోవడం. అంతేకాదు పేరెంటింగ్ కూడాపెద్దగా అనకూలంగా లేదు.ఎవరి జీవితం వారిది ఎవరి పరుగు వారిది అని అన్న విధంగా నిన్నటి దాకా ఉంటే ఇప్పుడు వర్క్ ఫ్రం హోం కారణంగా ఇంకా పని ఒత్తిడి అన్నది ఎక్కువై పిల్లల విషయమై అస్సలు ఆలోచించే తీరుబాటు వాళ్లకు లేకుండా పోతోంది.ఈ దశలో పిల్లలు పక్కదోవ పట్టేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.వారిలో జరిగే మానసిక ఆందోళనలు నియంత్రణకు నోచుకోక వికృత ప్రవర్తనకు అవి తావిస్తున్నాయి.
కరోనా కారణంగా చదువులు సాగుతున్న తీరు ఎంత బాగుందో అందరికీ తెలిసిందే.ముఖ్యంగా రెండేళ్లుగా చదవులన్నీ అటకెక్కిపోయాయి.ఆన్లైన్ చదువులు కూడా పెద్దగా సాగడం లేదు.ఇదే సమయంలో పిల్లలు మొబైల్స్ కు అతుక్కుపోతున్నారు. ఫలితంగా డిజిటల్ డిసీజ్ లు రానున్నాయి అని వాపోతున్నారు మానసిక వైద్యులు.తమ పిల్లలలో మానసికంగా వస్తున్న ఇబ్బందులను పరిష్కరించలేక తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. వీటిని నిలువరించేందుకు పెద్దగా ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పని లేదని,కొద్ది పాటి జాగ్రత్తలతోనే బయట పడవచ్చని వైద్యులు చెబుతున్నారు.పిల్లల నడవడి అదేవిధంగా ఆహారం తీసుకునే విధానం,ఆటపాటలకు కేటాయిస్తున్న సమయం,ఆ సమయంలో వారి ప్రవర్తన వీటన్నింటిపై కాస్త దృష్టి సారిస్తే, కొంతలో కొంత సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందని అంటున్నారు వైద్య నిపుణులు.ముఖ్యంగా టీనేజర్స్ లోనే సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని నిలువరించేందుకు మానసిక వైద్యులను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారని కూడా తెలుస్తోంది. వీటన్నింటిపై తల్లిదండ్రులే ముందు తమ పిల్లలపై ఓ అధ్యయనం చేయగలగాలి.వారి వెన్నంటే ఉంటూ వారి చదువులు, తీరిక సమయాలను సద్వినియోగం చేసుకునే తీరు వీటిపై కనీస శ్రద్ధ ఒక్కటే కాదు వారిని గైడ్ చేస్తూ ఉంటూ ఉంటేనే పక్కదోవ పట్టడం అన్నది జరగదు.