ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి ఎరుక అన్నది ఓ పాత సామెత. మనుషుల్లో కూడా అంతే! జేబులో పది రూపాయలు నీ దగ్గర ఉందా ఖరీదయిన కారు నీకు కావాలా అని హేళన చేసిన ఓ షాపు సిబ్బందికి గట్టి ఝలక్ ఇచ్చి తానేంటో నిరూపించాడు కర్ణాటకలోని ఓ రైతు. దీంతో షాక్ తిన్న సిబ్బంది దెబ్బకు దిగివచ్చి కాళ్ల బేరం కు సై అంది. దీంతో రైతు గెలవడమే కాకుండా ఇంకెప్పుడూ ఇలా చేయవద్దని సంబంధిత షాపు సిబ్బందికి ఓ చిన్న సైజు క్లాసు తీసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి..
కర్ణాటకకు చెందిన రైతు కెంపెగౌడ బొలెరే పికప్ ట్రక్ కొనేందుకు షోరూంకు వెళ్లగా అక్కడ మహేంద్ర కంపెనీకి చెందిన సిబ్బంది ఆయనను ఘోరంగా అవమానించారు.చుట్టూ ఆయన స్నేహితులు ఉండగా ఇది బొమ్మ కారు కాదు పది రూపాయలకే వచ్చేందుకు అని హేళన చేసి మాట్లాడారు.దీంతో రైతు ఆగ్రహంతో ఊగిపోయాడు.వెంటనే బయటకు వెళ్లి పది లక్షల రూపాయలు తీసుకువచ్చి గంటలో తనకు ట్రక్కు కావాలని పట్టుబట్టి మరీ! సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అక్కడితో ఆగలేదు సమీప పోలీసు స్టేషన్ కు పోయి ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆ రైతుకు నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించారు. ఆఖరికి గొడవ సర్దుమణిగింది.
చుట్టూ ఉన్నవారిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు.అందులో వేష ధారణ చూసి అస్సలు గేలి చేయకూడదు. ఓ మనిషి లో ఏ శక్తి ఉందో ఎవరికి ఎరుక.సరిగ్గా ఇదే పాయింట్ పై ఇప్పుడు డిస్కషన్ నడుస్తోంది సోషల్ మీడియాలో! కర్ణాటకలోని తుముకూర్ మహేంద్ర షోరూంలో జరిగిన ఈ ఘటన పెను సంచలనమే సృష్టిస్తోంది. కెంపెగౌడను అవమానించిన తీరుపై విఖ్యాత కంపెనీ మహేంద్రపై ఏకంగా పోలీసు కేసు నమోదు చేసేదాకా వెళ్లడంతో దేశ వ్యాప్తంగా ఈ విషయం వైరల్ అవుతోంది. దీంతో సంబంధిత కంపెనీ దిగి వచ్చి క్షమాపణలు చెప్పడంతో గొడమ ముగిసినా, ఇకపై ఇలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం సంబంధిత కంపెనీదే! వివాదం నేపథ్యంలో క్షమాపణలు కోరుతూ షో రూం సిబ్బంది లిఖిత పూర్వకంగా ఓ లేఖ కూడా రాసి ఇచ్చింది.