నడిసంద్రంలో తిండి నీరు లేకుండా జీవన పోరాటం. ఇదేదో
హాలీవుడ్ సినిమానో, డిస్కవరీ ఛానల్ లో వచ్చే బేర్ గ్రిల్స్ ప్రోగ్రాం కాదు.మన దేశంలో జరిగిన యదార్ధ సంఘటన. అండమాన్కు చెందిన ఓ వ్యక్తి నడి సంద్రంలో చిక్కుకొని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 28 రోజుల తర్వాత ఒడిశా తీరానికి చేరుకున్నాడు. అతనితోపాటు వచ్చిన స్నేహితుడు మధ్యలోనే చనిపోగా, శుక్రవారం అండమాన్ నుంచి 750(1300 కిలోమీటర్లు) నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఒడిశా లోని ఖిరిసాహి అనే తీర గ్రామానికి అతను ఉన్న పడవ కొట్టుకొచ్చింది.
వివిధ సరకులు, తాగునీటిని సముద్రంలో వచ్చిపోయే నౌకలకు విక్రయించే వ్యాపారం వారిది. ఇలా రూ.5 లక్షల విలువైన సరకులతో ఓ మర పడవలో అండమాన్ నికోబార్ దీవుల్లోని షాహిద్ ద్వీప్ నుంచి 'అమృత్ కుజుర్ (49) అనే వ్యక్తి తన స్నేహితుడు దివ్యరాజన్తో కలిసి సెప్టెంబరు 28న సముద్రంలోకి బయలుదేరాడు. ఈ లోపు తుపాను రావడంతో మర పడవ గతి తప్పింది, దానికితోడు ఇంధనం అయిపోవడమేకాక, పడవ పైభాగం దెబ్బతింది.సాయం కోసం వారి వద్ద ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పాడైపోవడంతో పడవలో బరువు తగ్గించుకోవాలని తీసుకొచ్చిన సరకులన్నింటినీ సముద్రంలో పారేశారు.
సాయం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా అటు గుండా వెళ్లే ఏ నౌకా వారిని గుర్తించలేదు. చివరికి బర్మాకు చెందిన ఓ నౌకాదళ ఓడ వారి వద్దకు వచ్చి 260 లీటర్ల డీజిల్, కంపాస్ ఇచ్చి సాయం చేసింది. బతుకు జీవుడా అంటూ.... ఇంటి ముఖం పడుతున్న సమయంలో బంగాళాఖాతంలో వారు మరో తుపాను ఎదుర్కోవాల్సి వచ్చింది. రాకాసి గాలులకు వారి మర పడవ మరింత దెబ్బతింది. భారీ అలలకు నీళ్లు లోపలికి చేరాయి. కానీ ఇంజిన్ ఆన్లోనే ఉంచడంతో అదృష్టవశాత్తు పడవ బోల్తా పడలేదు.తిండి, నీరు లేక నీరసించిపోయున అతణ్ని ఆస్పత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.
దివ్యరాజన్ కొద్ది రోజులకు మరణించాడు.నేను కూడా వర్షపు నీటిని తువ్వాలుతో ఒడిసి పట్టి తాగాను.స్నేహితుడి మృతదేహం రెండు రోజులు బోటులోనే ఉంచినా, అది కుళ్లిపోతుండడంతో సముద్రంలో పడేయాల్సి వచ్చింది.నేను కూడా చనిపోతానని అనుకున్నాను. కానీ దేవుడి దయవల్ల బతికాను'' అని కుజుర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అండమాన్లోని కుజుర్ కుటుంబానికి సమాచారం అందించామని పోలీసులు తెలిపారు.