ప్రేమ అనేది ఎప్పుడు ఎలా ఎవరి మీద పడుతుంది ఎవరికీ తెలియదు .అది చాలా పవిత్రమైనది అని అందరు అంటూ ఉంటారు, అలాంటి ప్రేమకి మన మనుషులే ఒక అడ్డు గోడ కూడా కట్టుకున్నారు అది కులం.ప్రేమకు కులం అడ్డురావడంతో ఓ జంట బలవన్మరణానికి పాల్పడింది. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం ఆముదాలపల్లి పంచాయితీ శివారు జయపురానికి చెందిన రాహుల్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో ఐటీ రెండోసంవత్సరం చదువుతున్నాడు.

ఈక్రమంలో ముదినేపల్లి మండలం అన్నారం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని హారికతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ మైనర్లే, కులాలు కూడా వేరుకావటంతో పెద్దలు విడదీస్తారని భయపడి పారిపోయారు. ఇరు కుటుంబాల సభ్యుల ఫిర్యాదులతో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.


ఎట్టకేలకు వీరి జాడ దొరికింది. ఇద్దరినీ తీసుకొచ్చి పంచాయితీ పెట్టి విడదీశారు. కులం తక్కువ వాడితో వెళతావా అంటూ హరికను మందలించారు. ఒకరినొకరు కలవకుండా ఆంక్షలు విధించారు. అయితే, కొద్దిరోజుల తర్వాత పనిమీద బయటకొచ్చిన రాహుల్ అదృశ్యమయ్యాడు. అదేసమయంలో హారిక కూడా కనిపించకుండా పోయింది. ఇద్దరి కోసం ఎంత ఎంత గాలించినా లాభం లేకపోయింది. మళ్లీ ఎటైనా పారిపోయారేమోనని అందరూ భావించారు. కానీ, ఎడబాటును తట్టుకోలేక పోయిన ఆ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది.


జయపురంలోని రాహుల్ అమ్మమ్మ ఇంటినుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు ఆదివారం సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు ఇద్దరూ శవాలై కనిపించారు. ఇంట్లోని బెడ్‌పై హారిక మృతదేహం ఉండగా రాహుల్ శవం ఉరికి వేలాడుతూ దర్శనమిచ్చింది. ఘటన జరిగి నాలుగు రోజులలై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే, లోపల ఆత్మహత్యలకు పాల్పడితే బయట తాళం వేసి ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది పరువు హత్యా, ఆత్మ హత్యా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: