పక్షులు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వలస పోవడం సర్వసాధారణమైన విషయం కొన్నిసార్లు అవి ఖండాంతరాలు దాటి మరీ వెళ్తూ ఉంటాయి.స్టెప్పీ అనే రకం గద్దలు
రష్యా నుంచి వలస పోవటం వాటి నైజం.
రష్యా నుంచి
ఇరాన్, పాకిస్తాన్లకు వలస వెళ్లాయి. అవి అలా వెళ్లినందుకు రష్యన్లు భారీగా డాటా, రోమింగ్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది.ఎంత భారీగా అంటే.. ఆ పక్షుల మీద పరిశోధనలకు కేటాయించిన నిధులన్నీ అయిపోయి కొండంత అప్పులు పేరుకున్నాయి.
అసలు పక్షులకు రోమింగ్ చార్జీలు ఎందుకంటే.. వాటిలో అమర్చిన ట్రాన్స్మిటర్ల నుంచి పరిశోధకులకు ఎస్ఎంఎస్ సందేశాలు అందుతుంటాయి. కానీ ఆ పక్షులు ఖండాలు దాటి వలస వెళుతుండటంతో నెట్వర్క్, డాటా రోమింగ్ చార్జీలు తడిసిమోపెడవుతున్నాయి.మిన్ అనే ఒక స్టెప్పీ గద్ద ప్రయాణం అన్నిటికన్నా ఖరీదుగా మారింది. అది కజకిస్తాన్ నుంచి ఇరాన్కు వెళ్లింది.వేసవి కాలంలో కజకిస్తాన్లో ఈ పక్షి మీద పరిశోధనలు ప్రారంభించి.. దాని వివరాలను ఎస్ఎంఎస్ రూపంలో తెలుసుకోవటానికి ట్రాన్స్మిటర్ అమర్చారు. కానీ.. మొబైల్ నెట్వర్క్ పరిధిలో లేకపోవటంతో ఆ ఎస్ఎంఎస్లు సరిగా అందలేదు.
అనూహ్యంగా ఆ పక్షి నేరుగా
ఇరాన్ వలస వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ పక్షికి అమర్చిన ట్రాన్స్మిటర్ నుంచి బ్యాక్లాగ్ మెసేజిలన్నీ భారీ సంఖ్యలో వచ్చిపడ్డాయి.
కజకిస్తాన్లో ఒక్కో ఎస్ఎంఎస్ చార్జీ 15 రూబుళ్లు (దాదాపు 17 రూపాయలు). కానీ..
ఇరాన్ నుంచి వచ్చిన ఒక్కో ఎస్ఎంఎస్కి 49 రూబుళ్లు (దాదాపు 55 రూపాయలు) చార్జీ అయింది. రోమింగ్లో ఉంది కనుక.
అలా.. అన్ని గద్దల కోసం కేటాయించిన నిధులన్నీ మిన్ వాడేసింది.
ఈ పక్షులు వలస వెళుతున్నపుడు అవి ఎక్కడున్నాయని తెలిపే అక్షాంశ రేఖాంశాలు ఈ ఎస్ఎంఎస్ల ద్వారా అందుతాయి. ఆ వివరాల ఆధారంగా శాటిలైట్ చిత్రాల ద్వారా.. ఆ పక్షులు సురక్షితమైన ప్రాంతాలకు చేరాయా అనేది పరిశోధకులు పరిశీలిస్తారు.రష్యా, మధ్య ఆసియా ప్రాంతంలో అంతరించే ప్రమాదంలో ఉన్న ఈ స్టెప్పీ గద్దలకు
విద్యుత్ లైన్లు ప్రత్యేకించి ప్రమాదకరంగా తయారయ్యాయి.పరిశోధకులు ప్రస్తుతం 13 గద్దలను ట్రాక్ చేస్తున్నారు. ఈ పక్షులు సైబీరియా, కజకిస్తాన్లలో గుడ్లు పెడతాయి. చలికాలంలో దక్షిణాసియాకు వలస పోతాయి.