ఆవేశం ఎంత‌టి అన‌ర్థానికి దారితీస్తుందో తెలియ‌జెప్పే ఉదంతం ఇది. అనురాగంపై...ఆగ్ర‌హం పైచేయి సాదిస్తే..జీవితం ఏమ‌వుతుందో...వివ‌రించే సంద‌ర్భం ఇది. వాళ్లిద్ద‌రిది ప్రేమ వివాహం. మంచి జీవితం కోసం సొంత ఊరి నుంచి హైద‌రాబాద్‌కు వ‌ల‌స వ‌చ్చారు. ఉన్నంత‌లో...త‌మ జీవితం ఏదో తాము గడిపేస్తున్నారు. అయితే, ఆ దంప‌తుల జీవితాల్లో నెల‌కొన్న పొరాపొచ్చాలు ఆత్మ‌హ‌త్య చేసుకునే వ‌ర‌కు చేరాయి.  భార్య చాయ్ పెట్టలేదన్న కారణంతో ఆ వ్యక్తి క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకున్నాడు.


హైద‌రాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌ సంచలనం సృష్టించడ‌మే కాదు..ప‌లువురిని ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది. ఈ సంఘ‌ట‌న వివరాల్లోకెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటకు చెందిన భక్తల అడివయ్య (35), జ్యోతి దంపతులది ప్రేమ పెళ్లి. త‌మ సొంత ఊరిలో ఉపాధి లేక‌పోవ‌డంతో... పది సంవ‌త్స‌రాల క్రితం హైద‌రాబాద్ వలస వచ్చి జీడిమెట్ల‌ బాలయ్యనగర్‌లో నివసిస్తున్నారు. ఆదివారం ఉదయం అడివయ్య చాయ్ పెట్టమని భార్యను అడుగడంతో.. ఆమె కొద్దిసేపటి తర్వాత పెడుతానని చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన అడివయ్య మద్యం సేవించి సమీపంలోని క్వారీ నీటిగుంతలో దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకొన్న జగద్గిరిగుట్ట పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసుకున్నారు. అయితే, టీ పెట్టే సంద‌ర్భంలో చోటు చేసుకున్న ప‌రిణామాలే అడివ‌య్య మ‌ర‌ణానికి కార‌ణ‌మా లేక‌పోతే అంత‌క‌ముందు ఏదైనా గొడ‌వ జ‌రిగిందా? అనే విష‌యాన్ని పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: