శాఖాహారులకు, మాంసాహారులకు సంబంధించిన ఆహారపు అలవాట్లు పేర్కొంటూ అనేక పరిశోధనలు అధ్యయనాలు వచ్చాయి. కానీ తాజాగా ఓ అధ్యయనంలో కీలక విషయాలు బయటపడ్డాయి. సగటున 45 ఏళ్ల వయసుగల 50వేల మందిని ఎంపిక చేసుకొని వారిపై పరిశోధకులు తమ అధ్యయనం చేశారు. వారిలో సగం మంది మాంసహారులుకాగా, మూడో వంతు మంది శాకాహారులుకాగా, ఐదో వంతు మంది చేపలు తినేవారు. వారిపై 18 ఏళ్లపాటు అధ్యయనం కొనసాగించారు. అనంతరం మెదడులో రక్తనాళాలు చిట్లి చనిపోవడం (బ్రెయిన్ స్ట్రోక్) మాంసాహారుల్లో తక్కువగా జరుగుతుందని, శాకాహారుల్లో ఎక్కువగా ఉంటుందని తేలింది.
50 వేల మందిపై 18 ఏళ్లపాటు అధ్యయనం జరిపి ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. మాంసాహారులకన్నా శాకాహారుల్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం 20 శాతం అధికమని పరిశోధకులు తెలిపారు. శాకాహారుల్లో మెదడు రక్తనాళాల గుండా తక్కువ కొలస్ట్రాల్, బీ12 లాంటి విటమిన్లు తక్కువగా ప్రవహించడం వల్ల రక్తనాళాలు చీలిపోయే అవకాశం ఎక్కువగా ఉందని వారు చెప్పారు. అయితే మాంసాహారుల్లో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెప్పారు. వారు తమ అధ్యయన వివరాలను బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురించారు.మాంసం తినేవారికన్నా శాకాహారులు, చేపలు తినే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని వారు తెలిపారు. మాంసహారులతో పోలిస్తే శాకాహారుల్లో గుండెపోటు వచ్చే అవకాశం 22 శాతం తక్కువని చెప్పారు.
శాకాహారుల్లో సాధారణ ఆకుకూరలు, కూయగారలు తినే వాళ్లు ఎక్కువగా ఉంటారని, దుంపలు, గింజలు, పప్పు దినుసులు, పండ్లు తినేవారు తక్కువగా ఉంటారని, శాకాహారుల మెదడు రక్తనాళాల్లో కొలస్ట్రాల్ శాతం తక్కువ ఉన్నవాళ్లు వీటిని తిన్నట్లయితే కచ్చితంగా కొలస్ట్రాల్ శాతం పెరుగుతుందని ‘బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్’ సీనియర్ డైటిస్ట్ ట్రేసి పార్కర్ చెప్పారు. నేటి పరిస్థితుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కన్నా గుండెపోటు వల్లనే ఎక్కువ మంది మరణిస్తున్నందున శాకాహారమే ఒక విధంగా మేలని ఆయన వ్యాఖ్యానించారు. మాంసహారులపైన అధ్యయనం జరపడం చాలా సులువుగానీ శాకాహారులపై అధ్యయనం జరపడం కష్టమని వివిధ యూనివర్శిటీలకు చెందిన ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు.