ఆస్తిలేకపోయినా మనుష్య జన్మకు అవసరమైనది ఆ సరస్వతీ దేవి కటాక్షమే అనడం ఏ మాత్రం సందేహం లేదు. అందుకే అంటారు అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఎందుకంటే ‘ఎవరు ఏం చేస్తారో.. ఎక్కడ వేలిముద్ర వేశానో.. నమ్మిస్తున్నారో, మోసగిస్తున్నారో.. ఎంత ఉందో తెలీదు..’ ఇన్ని సమస్యలు. అందుకే చదువులేని ధనవంతులు తమ పిల్లలకు డబ్బు కాదురా ముఖ్యం.. ముందు చదువుకోండి. చదువు లేక నేనెంత బాధపడ్డానో మీకు తెలీదు అని చెప్పడం చాలా మందిని చూసి ఉంటారు. అయితే ఇక్కడ ఓ నిరు పేద తమ పిల్లలను ఎంత కష్టపడి ఉన్నత స్థాయిలో నిలబెట్టాడు.
ఆరుగాలం శ్రమిస్తేగాని కుటుంబ జీవనం సాగని ఈ నిరు పేద వ్యవసాయ కుటుంబంలో సరస్వతీపుత్రులు వారంతా. పొలం పనులు చేసుకుంటూ ఇంటిని నడుపుతున్న అమ్మానాన్న కష్టాన్ని కళ్లారా చూసిన వారు చదివి ఉన్నత స్థానాలకు చేరాలన్న ఆకాంక్షను నెరవేర్చుకుని శభాష్ అనిపించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామానికి చెందిన కాకుమాను మంగిరెడ్డి, లక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే తాను పడుతున్న కష్టం తన బిడ్డలు పడకూడదనుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులున్నా అందరినీ ఉన్నత చదువులు చదివించాడు. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగానే పిల్లలు చదివి మంచి స్థానాల్లో స్థిరపడ్డారు.
ఈ క్రమంలోనే పెద్ద కుమార్తె నాగమణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించింది. రెండో కుమార్తె జానకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ప్రతిభ చూపి రెండు ఉద్యోగాలకు ఎంపికైంది. మున్సిపల్ శాఖలో శానిటరీ, హెల్త్ ఇన్స్పెక్టర్ల పోస్టులను సాధించింది. మూడో కుమార్తె శిరీష అమెరికా వెళ్లి ఫార్మ రంగంలో స్థిరపడింది. ఇక నాలుగో కుమార్తె మనోజ, కుమారుడు ప్రవీణ్ గోపిరెడ్డి బ్యాంకు ఉద్యోగాలు సాధించారు. ఇలా వారు కూడా అహర్నిశలు శ్రమించారు. చివరకు తల్లిదండ్రుల కలలను సాకారం చేసి మరికొందరికి ఆదర్శంగా నిలిచారు.