కష్టంలో, సుఖంలో ఇలా ప్రతి విషయంలో తోడు నీడగా బిడ్డకు అండగా ఉండేదే అమ్మ. తొమ్మిది నెలల పాటు ఎంతో కష్టపడి కడుపులో ఉన్న బిడ్డకోసం ప్రాణాల సైతం పణంగా పెడుతుంది అమ్మ. ఈ ప్రపంచ వ్యాప్తంగా మే 10న మాతృదినోత్సవం జరుపుకుంటున్నారు అందరూ. ఇక సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ కన్నతల్లిని ప్రేమించేవారు ఎందరో ఉన్నారు. ఈ రోజు మదర్స్డే సందర్భంగా అందరూ తల్లి ప్రేమలో ఫిదా అయిపోయారు.
తెలుగు సినిమారంగంలో అమ్మకు విశిష్ట స్థానం ఉంది. జాతీయ స్థాయిలో కూడా అమ్మ పాటకు గుర్తింపు తెచ్చారు వేటూరి సుందరరామ్మూర్తి. మాతృదేవోభవ చిత్రంలో ‘వేణువై వచ్చాను భువనానికి…గాలినై పోతాను గగనానికి’ అంటూ ఎంతో అద్భుతమైన పాటకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఇలా ఎందరో గాయకులు, కవులు అమ్మ గొప్పదనాన్ని గురించి చాటి చెపుతూనే ఉన్నారు.
కానీ ప్రస్తుతం మాత్రం ప్రపంచంలో అమ్మను చూసుకోవడం భారంగా భావించేవారు చాలా మంది ఉన్నారు. మనల్ని కంటికి రెప్పలా చూసుకునే తల్లికి వయస్సు పైబడితే భారంగా మారిపోతుంది ఈ రోజుల్లో. అందువల్లనే ఎన్నో వృద్ధాప్య ఆశ్రమాలు తయారవుతున్నాయి. ఆధునికత పెరుగుతున్న కొద్దీ మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. మనం మన పెద్దవారిని చూస్తే గౌరవిస్తే మనల్ని మన పిల్లలు గౌరవిస్తారు.
లేకుంటే అమ్మకు ఏర్పడిన గతే భవిష్యత్తులో మీకు ఏర్పడక తప్పదని మానసిక నిపుణులు మాతృదినోత్సవం సందర్భంగా కీలక సూచనలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అమ్మ ప్రాధాన్యతను తెలిపే పోస్టర్లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మదర్స్ డేను అందరూ అట్టహాసంగా జరుపుకుంటున్నారు. ఇక తల్లి ప్రేమను మించింది ఈ లోకంలో మరేదిలేదు. తల్లికి బిడ్డ ఎలా భారంకాదో బిడ్డకు కూడా తల్లితండ్రులు కూడా భారం కాకూడదు.