కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ప్రస్తుతం ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య ఇది. కరోనా వల్ల చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా 3.33 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే చాలా దేశాలు లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో కొత్తకేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య 50 లక్షలు దాటేసింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే... వెంటనే ఏం చేయాలి..? అన్న ఆలోచన చాలా మందికి వస్తుంటుంది. అలాంటప్పుడు ముందుగా.. ప్రభుత్వ ఆస్పత్రి, ప్రైవేట్ ఆస్పత్రి లేదా.. హెల్ప్లైన్ నంబర్లకూ కాల్ చెయ్యండి.
మిమ్మల్ని టెస్ట్ చెయ్యడానికి మీ శాంపిల్స్ తీసుకోమని అడగండి. అప్పుడు వాళ్లే మీ ఇంటికి వచ్చి శాంపిల్ తీసుకుంటారు. వాళ్లు రాకపోతే... మీరు ఆస్పత్రికి వెళ్లినా... అక్కడ పెద్ద క్యూ ఉంటే మాత్రం ఆ క్యూలో ఉండొద్దు. ఎందుకంటే.. ఒకవేళ మీకు కరోనా లేకపోవతే.. ఆ క్యూలో ఎవరికైనా ఉంటే.. అది మీకు వ్యాపిస్తుంది. ఇక కరోనా టెస్టు చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి ఎలాంటి ఇంజెక్షనూ అవసరం ఉండదు. కేవలం ముక్కు లేదా గొంతు నుంచి శాంపిల్ తీసుకొని... స్వాబ్ ద్వారా టెస్ట్ చేస్తారు. ప్రస్తుతం టెస్ట్ రిజల్ట్స్ 2 నుంచి 4 రోజులు పడుతున్నాయి.
కాబట్టి... ఆ సమయంలో మీరు ఇంట్లోనే ఉండి, స్వయంగా ఐసొలేషన్ చేసుకుంటానని ఫోన్లో డాక్టర్కి చెప్పండి. ఇంట్లోనే క్వారంటైన్ చేసుకుంటే... మీరు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ 6 అడుగుల దూరంలో ఉండండి. ముఖ్యంగా ముసలివాళ్లకు అత్యంత దూరంగా ఉండండి. అలాగే మాస్క్ ధరించండి. ఎప్పుడూ శానిటైజర్ మీ దగ్గరే ఉండాలి. వాట్సాప్, సోషల్ మీడియాలో చెప్పే సూచనలు పాటించవద్దు. వాటిని నమ్మితే కరోనా తగ్గకపోగా... సైడ్ ఎఫెక్ట్స్ కలిగే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే తరచూ డాక్టర్తో మాట్లాడుతూ.. వారి సూచనలు పాటించాలి. ఎక్కువ నీరు తాగండి. నిద్రపోండి, విశ్రాంతి తీసుకుంటూనే ఉండండి. అలాగే ఈ టైమ్లో ఏమాత్రం టెన్షన్ పడొద్దు.