మనలో చాలామంది చిరిగిపోయిన నోట్ల వల్ల నిత్య జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. చిరిగిపోయిన కరెన్సీ నోట్లను తీసుకోవడానికి వ్యాపారులు, కండక్టర్లు, పెట్రోల్ బంక్ సిబ్బంది ఇష్టపడరు. అయితే ఎక్కువ మొత్తంలో చిరిగిపోయిన నోట్లు ఉంటే బ్యాంక్ లేదా ఆర్బీఐ ద్వారా సులభంగా నోట్లను మార్చుకునే అవకాశం ఉంటుంది. చిరిగిపోయిన నోట్లతో పాటు నలిగిపోయిన, పాతబడిన నోట్లను కూడా బ్యాంకులు, ఆర్బీఐ ద్వారా సులభంగా మార్చుకోవచ్చు.
అయితే ప్రజల్లో చాలామంది బ్యాంకులు పాత నోట్లను తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని చెప్పడంతో పాడైపోయిన నోట్లను ప్రతి బ్యాంక్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. పాడైపోయిన నోట్లను తెచ్చిన వాళ్లు బ్యాంకు ఖాతాదారులైనా, ఖాతాదారులు కాకపోయినా ఎలాంటి చార్జీలను వసూలు చేయకుండా పాతనోట్లకు బదులుగా కొత్తనోట్లను ఇవ్వాలని ఆర్బీఐ సూచనలు చేసింది.
సెంట్రల్ బ్యాంక్ తీవ్రంగా దెబ్బ తిని చెల్లుబాటు కాని స్థితిలో ఉన్న కరెన్సీని సైతం ప్రత్యేక పద్ధతుల ద్వారా మార్చుకోవడం సాధ్యమవుతుందని తెలిపింది. కొన్ని రోజుల క్రితం కృష్ణా జిల్లాలో 5 లక్షల రూపాయల విలువైన నోట్లకు చెదలు పట్టిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత ఆర్బీఐ చిరిగిపోయిన నోట్లకు సంబంధించి ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.