98 ఏళ్ల వయస్సు.. ఇంకో రెండేళ్లయితే సెంచరీ కొట్టేసే వయస్సు.. ఈ వయస్సులో చాలా మంది మంచానికే పరిమితం అవుతారు. లేకపోతే.. ఇంట్లోనే ఉంటూ.. కృష్ణారామా అంటూ కూర్చుంటారు.. కానీ.. ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలికి చెందిన విజయ్‌ పాల్‌ సింగ్‌ అలా కాదు.. సెంచరీకి చేరువైనా..పనే తనకు ప్రాణం అంటున్నారు. ఈ వయస్సులోనూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న విజయ్‌ పాల్‌ సింగ్‌.. 98 ఏళ్ల వయస్సులో తన ఇంటి సమీపంలోని రోడు పక్కన ఓ తోపుడు బండి పెట్టుకుని  దాని మీద ఉడికించిన శనగలు.. మొలకలు పెట్టుకుని అమ్ముతున్నారు.


పోనీ.. పొట్టకోసం తిప్పలేమో అనుకుంటున్నారేమో.. అదేమీ కాదు.. ఆయనది చాలా పెద్ద పెద్ద కుటుంబం.. అసలు ఇలా పని చేయడం తన ఇంట్లో వారికి ఇష్టం లేదట. ఈ విషయం కూడా తానే చెప్పాడు. కానీ ఊరికే ఖాళీగా కూర్చోవడం తనకు నచ్చదట. అందుకే ఈ పని చేస్తున్నాను అని చెబుతున్నాడీ  విజయ్‌ పాల్‌ సింగ్‌ తాత. ఈ తాత శ్రమైక జీవన సౌందర్యం చూసి ముచ్చటపడిన  అలోక్‌ పాండే అనే వ్యక్తి  తాత వీడియోను తన ట్విట్టర్‌లో షేర్‌ చేసారు. ఇక ఇలాంటి వీడియో దొరికితే వైరల్ కాకుండా ఉంటుందా.. తెగ వైరలయ్యింది.


ఆ వీడియో అలా అలా గ్రూపుల్లో చక్కర్లు కొడుతూ రాయ్‌బరేలి జిల్లా మేజిస్ట్రేట్ వైభవ్‌ శ్రీవాస్తవ కంట్లో పడింది. ఆయన బోలెడు ఆశ్చర్యపోయి. ఆ తాతను తన కార్యాలయానికి ఆహ్వానించి స్వయంగా సన్మానించారు. 11,000 రూపాయల నగదును అందజేసి.. శాలువా కప్పి సన్మానం చేసి చేశారు. ప్రభుత్వ పథకం కింద వృద్ధుడికి ఇల్లు మంజూరు చేశారు.


విజయ్‌ పాల్‌ సింగ్‌ తాత గురించి యూపీ సీఎం కూడా మెచ్చుకున్నారట. ఆయన మా అందరికి స్ఫూర్తి అంటున్నారు కలెక్టర్. అందుకే అతడికి రేషన్ కార్డు, మరుగుదొడ్డి నిర్మాణానికి నిధులు ఇచ్చామన్నారు. ఆయనకు ప్రభుత్వం తరఫున ఇంకా ఏమైనా కావాలంటే వాటిని కూడా సమకూరుస్తామన్నారు. మొత్తానికి ఈ తాత చాలా గ్రేట్‌.. మీరు ఒప్పుకుంటారు కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: