ఒక మంచిమాట పలకడం వల్ల మనిషికి వేయి ఏనుగుల బలం వస్తుంది. చెడుమాట పలకడం వల్ల మనిషి మనసు నీరసించిపోతుంది. చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు కూడా చక్కని సంగీతానికి, మధుర స్తుతులకు, బుజ్జగించే మాటలకు తలలూపుతూ అనుకూలంగా వ్యవహరిస్తాయని మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెబుతారు. కాబట్టి, కలలోనైనా చెడు మాట నోటినుంచి వెలువడకూడదు. "ప్రాణం పోయినా సరే చెడుమాటను మాత్రం ఎన్నడూ పలకను" అని తమ జీవితాన్నే ధారపోసిన పుణ్య పురుషులెందరో ఉన్నారు. వారి మాట పూలబాట. ప్రియభాషణం వల్లే రాముడు ఆదర్శ మానవోత్తముడయ్యాడు. ప్రియభాషణంతోనే మహర్షులు గర్వాంధులైన రాజులకు కనువిప్పు కలిగించారు.
మాటలతోనే చిత్రహింసలు
ఈరోజుల్లో ధనం కోసం, అధికారం కోసం, ఆధిపత్యం కోసం, అక్రమార్జనల కోసం, అనుచిత సుఖాల కోసం, దుర్వ్యసనాల కోసం... మనుషులు తోటివారిని మాటలతో చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఉద్వేగకర వ్యాఖ్యల కారణంగా ఎందరో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకొంటున్నారు. మనిషిలో ఆత్మవిమర్శ కలగాలి. ఒక్కమాట కూడా రెచ్చగొట్టకుండా ఉండే విధంగా సంయమనాన్ని పాటించాలి. అదే మనిషి ఉన్నత వ్యక్తిత్వానికి దర్పణం. నోటినుంచి ఒక మాట వచ్చేటప్పుడు మనం ఎందుకు మాట్లాడుతున్నాం.. దానివల్ల మనకేమైనా ప్రయోజనముందా, లేదంటే ఎదుటివారి మనసును గాయపరుస్తుందా? అనే కోణంలో ఆలోచించగలిగితే అందరూ శ్రీరాముడిలా ప్రియభాషణమే చేయగలుగుతారు. కానీ ఎందరు ఆ విధంగా ఆలోచిస్తున్నారు? ఎందరు మంచిమాటవైపు మొగ్గుచూపుతున్నారు.
బాబా మాట-బంగారు బాట.
"ఇష్టాయిష్టాలు, సుఖదుఃఖాలు అమృతం లేదా విషం అనే విరుద్ధ భావాలు. అనుభవాలు కూడబెట్టుకున్న కర్మఫలం వల్ల ప్రవాహంలాగా వచ్చిపడతాయి - షిరిడీ సాయిబాబా
మంచి పనులు చేయాలంటే చెడు ఎదురవుతుంది. చెడ్డ బుద్ధి గల వారు మొదట అడ్డుతగులుతారు. లోకుల మాటలను లెక్క చేయని వారు చివరకు మంచి దారిలో వెళతారు - షిరిడీ సాయిబాబా
మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతాడు - స్వామి వివేకానంద
ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. అలాంటి ఒక గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే - స్వామి వివేకానంద
లోకులు తొందరగా నిందిస్తారు.. లేదా తొందరగా అభినందిస్తారు.. అందుచేత ఇతరులు నిన్ను అనే మాటలను పెద్దగా పట్టించుకోవద్దు.. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లు - స్వామి వివేకానందు