కని పారేసిన పిల్లలు ఎందరో
ఎవరో కోరిక ఎవ్వరిదో శాపం
ప్రతినిధులుగా వీళ్లు
ఆదుకునే వారెవ్వరు
అమ్మా నన్ను ఒంటరి చేయొద్దు అని
అర్థించినా ప్రార్థించినా వినేవారెవ్వరు
ఈ ఆధునిక కాలంలో మంచి బిడ్డలే కాదు
మంచి తల్లులు కూడా లేరే!
ఇవాళ చిల్డ్రన్స్ డే..బడి లేని రోజు పండుగ చేసుకున్నా, చేయకపోయినా చిన్నారులకు మాత్రం ఇవాళ ఓ ప్రత్యేకం అయిన రోజు. ఇలాంటి రోజు చిన్నారుల గురించి వారి తప్పిదాలు గురించి దిద్దుకోలేని ప్రవర్తన గురించి రాస్తున్నాం. చర్చించుకుంటున్నాం. బాగుంది కానీ ఇదే సందర్భంలో తల్లిదండ్రుల తప్పిదాల గురించి వారు చేస్తున్న అతి గురించి కూడా రాయాలి. ముఖ్యంగా చిన్నారులకు ఎన్నో సమస్యలు ఇవాళ ఉన్నాయి. ఓ వైపు టెక్నాలజీ పై ఎనలేని మోజు మరోవైపు తెలిసీ తెలియని వయసులో లైంగిక దాడులు ఇవన్నీ బిడ్డల జీవితాలను అస్తవ్యస్తంగా మారుస్తున్నాయి. ఏదయినా తెలుసుకోవాలన్న ఆత్రం ఉంటే మంచిదే కానీ తెలుకున్నాక వాటి వినియోగం ఎలా చేస్తున్నారు అన్నది కూడా ముఖ్యం. మోడ్రన్ సొసైటీలో అనేకం అయిన మార్పులు వస్తున్నాయి. వివాహేతర బంధాలు విపరీతంగా ఉంటున్నాయి. అదేవిధంగా అనైతిక శృంగార సంబంధాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వీటి ప్రభావం రేపటి సమాజం తప్పక ఉంటుంది.
ముఖ్యంగా కొన్ని కారణాల రీత్యా లేదా కొన్ని పరిస్థితుల రీత్యా కొందరు బిడ్డలు ఒంటరి వారు అవుతున్నారు. అమ్మ ప్రేమకు నోచుకోలేకపోతున్నారు. తమ కోరికలను నెరవేర్చుకునే క్రమంలో భాగంగా బిడ్డలకు జన్మనిచ్చే తల్లులకు ఈ పాటి తెలియదా? విడాకుల కారణంగా తల్లి దగ్గరో తండ్రి దగ్గరో ఉండిపోతున్న బిడ్డలు కొందరైతే, వివాహేతర బంధాల కారణంగా చాలా మంది బిడ్డలు అనాథ శరణాలయాలకు చేరిపోతున్నారు. మురికి కాలువల పక్కన కనిపారేసిన బిడ్డలను దగ్గరకు చేరదీసి పెంచేదెవ్వరని? ఈ క్రమంలో బిడ్డల పోషణ రక్షణ అన్నవి ఇప్పుడు కీలకం కావాలి. మంచి బిడ్డలు ఎంత ముఖ్యమో అంతే స్థాయిలో మంచి తల్లిదండ్రులు కూడా ముఖ్యమే! అలా లేని నాడు మంచి సమాజం నిర్మాణం సాధ్యం కాదు కూడా!