మానవుడు చంద్రునిపై అడుగు వేసేందుకు పరిగెడుతున్న ప్రస్తుత తరుణంలో చేతబడి ద్వారా ఒక మహిళను చంపాడనే కారణంగా ఒక యువకుని సజీవ దహనం చేసిన సంఘటన హైదరాబాద్ నగర శివారులోని శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అద్రాస్ పల్లి గ్రామంలో గ్యార లక్ష్మి అనే మహిళ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ, బుధవారం మృతి చెందింది. అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు.
గ్యార లక్ష్మి అనారోగ్యం తో మృతి చెందడానికి అదే గ్రామానికి చెందిన చెందిన బోయిన ఆంజనేయులు చేతబడి చేయడమే కారణమని కుటుంబ సభ్యులు అనుమానించారు . అందు వల్లే లక్ష్మి చనిపోయిందని కుటుంబసభ్యులు భావించారు . లక్ష్మి దహనసంస్కారాలు అనంతరం, ఆంజనేయులు అక్కడికి వస్తాడు అని వారంతా భావించి అక్కడే కాపు కాశారు . యాదృచ్చికంగా ఆంజనేయులు అక్కడికి రావడంతో లక్ష్మి అతని వల్లే చనిపోయిందని, అతని తలపై కర్రలతో మోది విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం ఆంజనేయులును , లక్ష్మి చితి పైన వేసి సజీవ దహనం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని లక్ష్మీ బావ బలరాంను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చేతబడి, బాణామతి వంటి మూఢనమ్మకాలు ఇంకా పల్లె ప్రజలను వేధిస్తున్న అనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం. సమాజం సాంకేతికంగా ఎంతో పురోగమిస్తున్నప్పటికీ ఇంకా మూఢ నమ్మకాల మధ్య పల్లె ప్రజలు బతుకులీడుస్తున్నార డానికి ఈ సంఘటన ను ఉదాహరణగా పేర్కొనవచ్చునని సామజికవేత్తలు అంటున్నారు . అసలు చేతబడి , బాణామతి వంటి వల్ల ఏమి కాదని పల్లె ప్రజల్లో అవగాహన ను కల్పించాల్సిన అవసరాన్ని అంజనేయులు సజీవ దహన ఘటన మరోసారి గుర్తు చేస్తోందని అంటున్నారు .