అలా టీడీపీ కంచుకోటగా ఉన్న పెనుకొండలో తొలిసారి వైసీపీ జెండా ఎగిరింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున శంకర్ నారాయణ విజయం సాధించారు. తొలిసారి గెలవడమే కాదు...మంత్రి కూడా అయ్యారు. అయితే మంత్రి స్థాయి వరకు ఎదిగిన శంకర్ నారాయణ రాజకీయ జీవితం టీడీపీలోనే మొదలైంది. 1995 సమయంలో ఆయన టీడీపీలోకి వచ్చారు. అలాగే కౌన్సిలర్గా కూడా పనిచేశారు.
ఇక 2011లో ఆయన వైసీపీలోకి వచ్చారు...ఆ తర్వాత 2014లో పెనుకొండలో పోటీ చేసి ఓడిపోగా, 2019 ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా శంకర్ నారాయణ పనిచేస్తున్నారు. మంత్రిగా శంకర్ పనితీరు ఎలా ఉందో...ప్రజలకు తెలియదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రెండున్నర ఏళ్లలో మంత్రిగా ఈయన పెద్దగా హైలైట్ కూడా కాలేదు. అలాగే తన శాఖకు సంబంధించి అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేదు. ఎందుకంటే ఏపీలో రోడ్లు పరిస్తితులని చూస్తేనే అర్ధమవుతుంది. మంత్రిగా శంకర్ నారాయణ సక్సెస్ అవ్వలేదనే చెప్పొచ్చు.
ఇక ఎమ్మెల్యేగా పెనుకొండలో శంకర్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే...అవి కొత్తగా గ్రామ సచివాలయాలు కట్టడం, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, రైతు బజార్లు, అలాగే జగనన్న కాలనీల పేరిట ఇళ్ళు కట్టించే కార్యక్రమాలు. అలాగే నాడు-నేడు ద్వారా కాస్త ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయి. అక్కడక్కడ సిసి రోడ్ల నిర్మాణం. ఇవే అభివృద్ధి పనులు.
నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరుకు ఇబ్బందులు ఉన్నాయి...అక్కడే కియా పరిశ్రమ ఉన్నా సరే అనుకున్న మేర అభివృద్ధి లేదు. ఇక నియోజకవర్గంలో మంత్రిగారి అనుచరుల దందాలు, అక్రమ వసూళ్లు ఎక్కువే అని టీడీపీ ఆరోపిస్తుంది. ఇళ్ల స్థలాల్లో బాగానే నోక్కేశారని, అలాగే స్థలాలు ఇవ్వడానికి ప్రజల దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రాజకీయంగా చూస్తే మంత్రిగా ఉన్నా సరే శంకర్ నారాయణ బలం తగ్గుతున్నట్లే కనిపిస్తోంది. అదే సమయంలో ఇక్కడ టీడీపీ నేత బికే పార్థసారథి పికప్ అవుతున్నట్లు తెలుస్తోంది. పైగా పెనుకొండ ఎలాగో టీడీపీకి కంచుకోట..కాబట్టి నెక్స్ట్ పెనుకొండలో శంకర్ నారాయణ గెలుపు అంత సులువు కాదు.