టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మొదటగా నువ్వే కావాలి సినిమా ద్వారా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు సునీల్. వాస్తవానికి అంతకముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీలో కొన్ని క్షణాలుండే చిన్న పాత్రలో కనిపించిన సునీల్ కు నువ్వే కావాలి సినిమా బాగానే పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన చిరునవ్వుతో, నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాలు మంచి సక్సెస్ లు అందుకొవడంతో పాటు కమెడియన్ గా సునీల్ కు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.
ఇక అక్కడి నుండి టాలీవుడ్ లో కమెడియన్ గా వరుస అవకాశాలతో కొనసాగిన సునీల్ ఆపై ఎన్నో సినిమాల్లో కడుపుబ్బా నవ్వించే పలు పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. అయితే ఆ తరువాత లక్ష్మి నారాయణ దర్శకత్వంలో వచ్చిన అందాలరాముడు సినిమాతో హీరోగా మారాడు సునీల్. ఆ సినిమా సునీల్ కు హీరోగా బాగానే పేరు తెచ్చిపెట్టగా, అనంతరం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మర్యాద రామన్న సినిమా మరింత పెద్ద విజయాన్ని అందించింది. వాస్తవానికి సునీల్ ఆ తరువాత అక్కడక్కడా కొన్ని సినిమాలు హీరోగా నటించినప్పటికీ అవి సక్సెస్ కాలేదు.

అనంతరం మళ్ళి కొన్నాళ్ల క్రితం నుండి కమెడియన్ గా సినిమాలు చేస్తున్న సునీల్, సడన్ గా ఇటీవల రవితేజ హీరోగా వచ్చిన డిస్కోరాజా సినిమాతో విలన్ గా మారాడు. అయితే ఆ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం కలర్ ఫోటో సినిమాలో నెగటివ్ పాత్ర చేస్తోన్న సునీల్, కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ ఆచార్య మూవీలో కూడా ఒక నెగటివ్ పాత్రలో నటించినట్లు సమాచారం. సినిమాలో సునీల్ పాత్ర చిన్నదే అయినప్పటికీ కూడా ఎంతో క్రూరంగా ఉంటుందని, అలానే దాని తాలూకు షూటింగ్ కూడా లాక్ డౌన్ కు ముందే జరిగిందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే ఆచార్య మూవీ యూనిట్ నుండి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ....!!

మరింత సమాచారం తెలుసుకోండి: