గత ఎన్నికల సమయంలో కొత్తగా వైసీపీలో చేరిన పృథ్వీ పవన్పై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నాడు. పవన్ కల్యాణ్ పేరు చెబితేనే ఒంటికాలిపై లేచాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మరింతగా రెచ్చిపోయి జనసేనానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. కానీ, ఎస్వీబీసీ చైర్మన్ పదవి పోయిన తర్వాత పరిస్థితి దారుణంగా తయారైంది. ఒకానొక సమయంలో ఆయన చేతిలో ఒక్క ప్రాజెక్టు కూడా లేకుండా పోయింది. అటు పార్టీలో గుర్తింపు లేక.. ఇటు సినిమాల్లో అవకాశాలు లేక నానా అవస్థలు పడ్డాడు.
సినిమా అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి మళ్లీ కొత్త లైఫ్ ఇచ్చారు. చిరంజీవే స్వయంగా పృథ్వీకి తన సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి మళ్లీ బిజీ అయిపోయాడు పృథ్వీ. ఈ విషయాన్ని అతడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ క్రమంలోనే తాజాగా పవర్ స్టార్ గురించి పృథ్వీ కొన్ని కామెంట్స్ చేశాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ గురించి మాట్లాడుతూ.. ‘పవన్ సినిమాలు చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. అసలు అందులో తప్పేముంది. అది ఆయన వృత్తి. జగన్ లాగే ఆయనకు కూడా ప్రజల మీద దృష్టి ఎక్కువ. అందుకే వాళ్ల తరపున పోరాడుతున్నాడు’ అంటూ కామెంట్స్ చేశాడు. ఇప్పుడీ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.