హాస్యానికి చిరునామ ఆయన, దశాబ్ధాల కాలం పాటు తెలుగు ప్రేక్షకులను తన హాస్యంతో నవ్వుల పువ్వులలో విహరింపచేసిన చరిత్ర ఆయనది. ఎలాంటి పాత్ర అయిన సరే, ఆ పాత్రను ఆయన పోషించగానే దానిలోని అంతర్లీనమైన హాస్యం పొంగిపోర్లుతుంది. అప్పట్లో ఆయన తెరపై కనిపించగానే ప్రేక్షకుల మనసులోంచి నవ్వు ఉప్పొంగేది. అందుకే, హాస్యం అంటేనే ఆయన, ఆయన అంటేనే హాస్యం. ఆయనే అల్లు రామలింగయ్యగారు.
నేటి తరం ప్రేక్షకుల హృదయాల్లో కూడా బలంగా నాటుకుపోయిన హాస్య చక్రవర్తి అల్లు రామలింగయ్య. భౌతికంగా ఆయన ఇప్పుడు లేకపోవచ్చు. కానీ ఆయన పంచిన హాస్యసుగంధాలను మరో వందేళ్ళు అయినా ఆనందగా నెమరవేసుకోవచ్చు. అల్లు రామలింగయ్య గారి సినీ ప్రస్థానం నేటి నటీనటులకు ఆదర్శం. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలలో నటించి.. తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకుని, ఆ తర్వాత ఎన్నో వందల చిత్రాల్లో తన హాస్యంతో నటవిశ్వరూపం చూపించిన లెజండరీ నటుడు 'అల్లు రామలింగయ్య'.
అలాగని హాస్యం ఒక్కటే అల్లు రామలింగయ్య స్పెషాలిటీ అనుకుంటే పొరపాటే. ఆయన ఎన్నో విలక్షణమైన వైవిధ్యమైన పాత్రలు కూడా చేశారు. ఆయన కృషి, పట్టుదల అమోహం. ఓ పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన, మహా మహా నటుల సరసన సగర్వంగా నిలబడగలిగారు అంటే.. కారణం కేవలం ఆయన మాత్రమే.
ఆయనలోని నటన మాత్రమే. 2004వ సంవత్సరంలో ఆ హాస్య నట శిఖరం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయినా ప్రేక్షకుడి గుండెల్లో మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటారు. అన్నట్టు అల్లు రామలింగయ్య నాటకాల్లో నటిస్తున్న కాలంలో.. గాంధీజీ పిలుపునందుకుని ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఆ క్రమంలో జైలుకు కూడా వెళ్లారు. అయితే, జైలులో కూడా అల్లు రామలింగయ్య నాటకాలు ఆడారు.
ముఖ్యంగా అల్లు రామలింగయ్య గారు ఆడిన నాటకాల్లో ముఖ్యమైన నాటకం, అంటరానితనం పై పోరు అనే నాటకాన్ని ఆయన ఎక్కువ ఆడారు. పైగా ఆయనకు ఆ నాటకం అంటే చాలా ఇష్టం అట.