పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో స్పీడ్‌గా సినిమాలకి సైన్ చేయగానే సినీ జనాలంతా జనాలంతా  ఆశ్చర్యపోయారు. ఎప్పుడూలేనిది ఈ వేగమేంటని సర్‌ప్రైజ్ అయ్యారు. అయితే పవన్‌ మళ్లీ లాంగ్‌ బ్రేక్ తీసుకోవడానికే ఇంత స్పీడ్‌గా సినిమాలని ఓకే చేశాడని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్‌ 2019 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకి ముందు సినిమాలకి బ్రేక్ ఇచ్చాడు. 'అజ్ఞాతవాసి' తర్వాత పూర్తిగా రాజకీయాలకే అంకితమయ్యాడు. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోయాక మళ్లీ కెమెరాముందుకొచ్చాడు. 'వకీల్‌సాబ్'తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేశాడు.

పవన్‌ కళ్యాణ్‌ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లకముందు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేసేవాడు. అయితే ఫుల్‌టైమ్‌ పాలిటీషియన్ కమ్‌ పొలిటికల్‌ లీడర్‌గా మారాక ఒకేసారి 5 సినిమాలకి కమిట్ అయ్యాడు. దీంతో పవన్ ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోయారు. అయితే పవన్ 2022 తర్వాత ఈ సంబరాలకి బ్రేక్‌ ఇస్తాడనే టాక్ వస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్‌.కె.చంద్ర దర్శకత్వంలో 'భీమ్లానాయక్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ అవుతోంది. అలాగే క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' చేస్తున్నాడు. ఈ మూవీ సమ్మర్‌లో ఏప్రిల్‌ 29న రిలీజ్‌ కాబోతోంది. వీటితోపాటు హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో 'భవదీయుడు భగత్‌సింగ్' చేస్తున్నాడు.

పవన్‌ కళ్యాణ్‌ 'భగత్‌సింగ్' సినిమా తర్వాత షూటింగ్స్‌కి బ్రేక్ ఇస్తాడని ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికలకు పార్టీని సిద్ధం చెయ్యడానికి, ప్రజలకు మరింత చేరువకావడానికి రెండేళ్ల పాటు ప్రజాక్షేత్రంలో తిరగాలనుకుంటున్నాడట పవన్. అందుకే ఇప్పుడు కొత్తగా సినిమాలకి సైన్ చెయ్యట్లేదని, సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చేయాల్సిన సినిమాని కూడా పోస్ట్‌ పోన్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ 2022 తర్వాత సినిమాలకు దూరమవుతున్నట్టు తెలుస్తోంది. ఇది ఆయన అభిమానులకు కొంత నిరాశపర్చినా... రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనబోతుండటం ఆశలు రేపుతోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: