తెలుగు సినీ పరిశ్రమలు పలు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలున్నాయి. అలాంటి సంస్థలు రూపొందించే సినిమాల్లో నటించే అవకాశమొస్తే బాగుండునని నటీనటులు అనుకుంటుంటారు. అలాగే హీరోలు కూడా భావిస్తుంటారు. ఇక వారి అభిమానులు అయితే.. పలానా ప్రముఖ దర్శకుడు, నిర్మాత, హీరో కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుండునని అనుకుంటుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే- నిర్మాత అల్లు అరవింద్, స్టార్‌ హీరో నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో త్వరలో సినిమా వస్తుందన్న ప్రచారం జోరందుకుంది. "ఆహా" ఓటీటీలో టాక్‌ షోకు బాలయ్యను అల్లు అరవింద్‌ ఖరారు చేయడం, అందుకు బాలకృష్ణ కూడా సరేనని "అన్‌ స్టాపబుల్‌ టాక్‌ విత్‌ ఎన్‌బీకే" పేరుతో ప్రోగ్రామ్‌ కూడా చేస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య మంచి టెంపో కుదిరిందనీ, త్వరలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక చిత్రం కూడా రూపొందనుందని ప్రచారం జరుగుతోంది.

నిజానికి గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌, నట సింహం బాలకృష్ణ కాంబినేషన్‌లో ఇప్పటివరకు సినిమా రాలేదు. వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందన్న ఊహ కూడా మొన్నటివరకు అటు మెగా ఫ్యాన్స్‌ కానీ, ఇటు నందమూరి అభిమానులకు రాలేదు. ఎందుకంటే అల్లు అరవింద్‌, బాలకృష్ణ ఇద్దరూ రెండు భిన్న ధృవాలుగా మాదిరిగా ఉంటారు. పైగా అల్లు అరవింద్‌ పక్కా కమర్షియల్‌ అని, ఆయన రూపొందించే చిత్రాలకు మెగా ఫ్యామిలీలోని హీరోలే ఎక్కువ అవుతుంటారని, అలాంటిది ఇక ఆయన బయటి హీరోలతో చిత్రాలు చేయడం కష్టమేనన్న అభిప్రాయాలు కూడా సినీ వర్గాలు, ప్రేక్షకుల్లో ఉన్నాయి. అయితే ఇటీవల "ఆహా" ఓటీటీ ఈవెంట్‌లో నిర్మాత అల్లు అరవింద్‌.. "బాలయ్య టపాసులాంటి వాడు" అంటూ చేసిన కామెంట్లు, ఆయనతో "ఆహా" ఓటీటీలో టాక్‌ షో ప్రమోట్ చేయాలనుకోవడం, అందుకు బాలయ్య ఒప్పుకోవడం, దీపావళి నుంచి "ఆహా" ఓటీటీలో "అన్‌స్టాపబుల్‌ టాక్‌ విత్‌ ఎన్‌బీకే" ప్రోగ్రామ్‌ ప్రారంభం కావడం వంటి పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే నట సింహం బాలకృష్ణ హీరోగా అల్లు అరవింద్‌ నిర్మాతగా సినిమా చేయబోతున్నారనే ప్రచారం సినీపరిశ్రమలో జోరుగా జరుగుతోంది.

నిజానికి నిన్నమొన్నటి దాకా ఇలాంటి వార్త వస్తే కనుక దాన్ని కచ్చితంగా కొట్టి పారేసేవారే. అయితే ఇప్పుడు "ఆహా" ఓటీటీలో బాలయ్య టాక్‌ షోతో అల్లు అరవింద్‌- బాలకృష్ణ మధ్య బంధం బలపడుతోంది కాబట్టి.. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే కొట్టిపారేయలేమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: