ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలోనూ ఇదే తీరు కనిపిస్తోంది. జనవరిలో కరోనా థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశం ఉందన్న శాస్త్రజ్ఞుల అంచనాలు నిజమేనేమో అనిపిస్తుంది. నిన్న, మొన్నటి వరకు ఈ మహమ్మారి ప్రశాంతంగా వున్న సమయంలో మళ్ళీ పెరుగుతున్న పాజిటివ్ కేసులు అందరినీ సందిగ్ధంలోకి నెట్టేస్తున్నాయి. కరోనా కనుక మళ్ళీ తిరగబడితే మళ్ళీ థియేటర్లకు సినిమా కష్టాలు తప్పవు. ఈ క్రమంలో జనవరిలో రిలీజ్ చేయాల్సిన పలు సినిమాలు వాయిదా వేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అందులో ముఖ్యంగా ప్రభాస్ చిత్రం 'రాదేశ్యాం' పేరు ప్రధానంగా వినబడుతోంది.
రిలీజ్ చేసేసి తరవాత తంటాలు పడేకన్నా ఇంకొద్ది రోజులు వెయిట్ చేసి ఒకేసారి సమ్మర్ వెకేషన్ కి ప్లాన్ చేస్తే మంచిదని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే ఈ సినిమా విడుదల చాలా లేట్ అయిందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్న నేపథ్యంలో ఈ వార్తలే నిజమైతే వారి స్పందన ఎలా ఉంటుందో మరి. వింటేజ్ బ్యాక్డ్రాప్ లో ఇటలీలో జరిగే ప్రేమకథగా ఈ సినిమా రూపుదిద్దుకుంది.